Supreme Court: టపాసుల నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • కాలుష్యం చేయనివి ఉంటే చెప్పాలన్న ధర్మాసనం
  • కొందరి ఉపాధి కోసం ఇతరుల జీవించే హక్కును కాలరాయలేం
  • దానిని పరిరక్షించేందుకే మేమున్నాం
Supreme Court Comments On Crackers Ban

బాణసంచా నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టపాసులను నిషేధించాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఇవాళ జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ ఎ.ఎస్. బోపన్నల ధర్మాసనం విచారించింది. కొందరికి ఉపాధి దొరుకుతుందని చెప్పి, ఇతరుల జీవించే హక్కులను హరించడం మంచిదికాదని వ్యాఖ్యానించింది. అమాయకుల జీవించే హక్కును పరిరక్షించడమే తమ విధి అని పేర్కొంది.

పర్యావరణానికి హాని చేయని టపాసులుంటే చెప్పాలని, వాటికి నిపుణుల కమిటీ ఆమోదం తెలిపితే అందుకు అనుగుణంగా ఆదేశాలిస్తామని తెలిపింది. దేశంలో చట్టాలున్నా వాటి అమలు కష్టతరమవుతోందని వ్యాఖ్యానించింది. కాగా, బాణసంచా తయారీదారుల సంఘం కూడా తన వాదనలను వినిపించింది. దీపావళి పండుగ దగ్గరకొస్తోందని, టపాసుల విషయంలో పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రత సంస్థ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం లక్షల మంది ఉపాధి లేకుండా ఉన్నారని పేర్కొంది. అయితే, వారి ఉపాధి కోసం ఇతరుల హక్కులను కాలరాయలేమన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది.

More Telugu News