India: మాల్దీవుల పశ్చాత్తాపం.. భారత్ పై ఇంకెప్పుడు అలాంటి వ్యాఖ్యలు పునరావృతం కావంటూ హామీ

  • భారత్ తో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ దిశగా అడుగులు
  • ఇండియాలో పర్యటించిన మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్
  • కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ తో సమావేశం
maldives external affairs minister meets indian counterpart

ప్రముఖ పర్యాటక దేశం మాల్దీవులు పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. భారతీయుల ‘బాయ్ కాట్ మాల్దీవ్స్’ నినాదంతో దెబ్బకు దిగి వచ్చింది. ప్రధాని మోదీ ఈ ఏడాది జనవరిలో చేపట్టిన లక్షద్వీప్ పర్యటనపై తమ మంత్రులు గతంలో చేసిన వ్యాఖ్యలను పునరావృతం కానివ్వబోమంటూ హామీ ఇచ్చింది. ఈ విషయంలో భారత్ తో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా అడుగులు వేసింది.

ఇందులో భాగంగా మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్‌ భారత పర్యటనకు వచ్చారు. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మా వాళ్లు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ అభిప్రాయం కాదని ఇప్పటికే స్పష్టం చేశాం. అలా జరిగి ఉండాల్సింది కాదు. అలాంటి వైఖరి పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ఈ విషయంలో తలెత్తిన అపార్థాల దశను దాటేశాం. ఇరు దేశాల ప్రభుత్వాలు జరిగిన విషయాన్ని అర్థం చేసుకున్నాయి’ అని చెప్పారు.

ఈ భేటీలో జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇరుదేశాల ప్రయోజనాలతోపాటు పరస్పరం అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. తాము పొరుగు వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చే విధానానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. మాల్దీవులను అవసరమైన ప్రతిసారీ ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ లక్షద్వీప్‌ పర్యటనలో భాగంగా సముద్రంలో సరదాగా స్నార్కెలింగ్‌ చేశారు. సాహసాలు చేయాలనుకునే వారికి లక్షద్వీప్‌ సరిగ్గా సరిపోతుందని పేర్కొన్నారు. టూరిస్టులు తాము చూడాల్సిన ప్రాంతాల జాబితాలో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అక్కడి అందమైన ఫొటోలను సోషల్ మీడియాతో పంచుకున్నారు.

అయితే మోదీ పర్యటనపై ముగ్గురు మాల్దీవుల మంత్రులు నోరుపారేసుకున్నారు. ఇండియాలోని బీచ్ లలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు పడి ఉంటాయని విమర్శించారు. భారతీయులు బీచ్ లను పరిశుభ్రంగా ఉంచరని.. తమ దేశానికి వచ్చే భారతీయ టూరిస్టులు కూడా బీచ్ లను పాడుచేస్తున్నారని కామెంట్లు చేశారు.

ఈ వ్యాఖ్యలపై భగ్గుమన్న నెటిజన్లు బాయ్ కాట్ మాల్దీవ్స్ నినాదాన్ని అందుకున్నారు. దేశంలోని పర్యాటక ప్రాంతాలనే ప్రోత్సహిద్దామని సంకల్పం తీసుకున్నారు. ఫలితంగా మాల్దీవులు వెళ్లేందుకు అప్పటికే విమానాలు, అక్కడి హోటళ్లు బుక్ చేసుకున్న వేలాది మంది భారత టూరిస్టులు తమ పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటక రంగం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ఆ తర్వాత నుంచి అధ్యక్షుడు ముయిజ్జు తీసుకున్న భారత వ్యతిరేక నిర్ణయాలు కూడా ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో జమీర్‌ భారత్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News