Uttar Pradesh: కనిపించకుండా పోయిన భర్త మృతదేహాన్ని కనిపెట్టిన భార్య.. ఎలా తెలిసిందంటే వింత సమాధానం!

  • భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసిన మహిళ
  • ఫొటో తీసుకురమ్మంటే మళ్లీ స్టేషన్ ముఖం చూడలేదు
  • సడెన్‌గా భర్త మృతదేహం కనిపెట్టిన భార్య
  • భర్త కలలోకొచ్చి చెప్పాడని సమాధానం
  • మృతుడిది హత్యే అంటున్న వైద్యులు
women says husband told his deadbody location in her dreams

కొన్ని రోజుల క్రితం తన భర్త కనిపించడం లేదంటూ ఒక యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త ఫొటో ఉంటే ఒకటి తీసుకురావాలని ఆమెకు చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఆ యువతి పోలీసు స్టేషన్‌కు వెళ్లలేదు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. తన భర్త మృతదేహం ఒక వంతెన దగ్గర లభించిందని చెప్పింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. ధోలేవాల్‌లోని ప్రతాప్ నగర్‌లో కుటుంబంతో కలిసి రామ్ లగన్ (30) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇటీవల అతను ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని అతని భార్య ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మళ్లీ పోలీసు స్టేషన్‌కు వెళ్లలేదు. దీంతో అతను తిరిగి వచ్చాడేమో అని పోలీసులు అనుకున్నారు.

కొన్ని రోజుల తర్వాత భర్త మృతదేహం దొరికిందంటూ ఆమె పోలీసులకు సమాచారం అందించింది. లోహారా కాలువ వంతెన వద్ద రామ్ లగన్ మృతదేహం దొరికినట్లు పోలీసులకు తెలిసింది. దీంతో ఆ మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి పోస్టు మార్టం చేయించారు. అక్కడ అతని శరీరంపై పదునైన వస్తువుతో దాడి చేసినట్లు గుర్తులు కనిపించాయి.

గొంతు, చేతులు, కడుపులో పదునైన వస్తువుతో పొడిచినట్లు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఇంకా పూర్తి పోస్టుమార్టం నివేదిక తయారు కాలేదని తెలుస్తోంది. వైద్యులు చెప్పిన మాటలు విన్న పోలీసులకు మృతుడి భార్యపై అనుమానం కలిగింది.

భర్త మృతదేహం వంతెన వద్ద ఉందని ఎలా తెలుసని ఆమెను ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ భర్త తన కలలోకి వచ్చాడని, మృతదేహం ఎక్కడుందో తనే చెప్పాడని సమాధానం ఇచ్చింది. ఈ వింత సమాధానం విన్న పోలీసులు ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తానే భర్తను హత్యచేసి ఇలా డ్రామాలు ఆడుతోందేమో అన్న అనుమానంతో ఆ దిశగా ఆమెను విచారిస్తూ, దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News