Sri Lanka: భారత్ సమీపంలోని మూడు దీవులను చైనాకు అప్పగించేసిన శ్రీలంక

  • పవన్ విద్యుదుత్పత్తి కోసమేనన్న ఆ దేశ ఎంపీ
  • శ్రీలంక తమిళుల నుంచి వ్యతిరేకత
  • తమిళ సీఎం స్టాలిన్‌పై ప్రశంస
Sri Lanka Handed Over Its Three Islands To China

భారతదేశానికి సమీపంలో ఉన్న మూడు దీవులను చైనాకు శ్రీలంక అప్పగించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శ్రీలంక చేసిన ఈ పనివల్ల భారతదేశానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని శ్రీలంక తమిళులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన విద్యుదుత్పత్తి కోసం తమ దేశానికి చెందిన మూడు దీవులను చైనాకు అప్పగించిన విషయాన్ని ఆ దేశ ఎంపీ రాధాకృష్ణన్ తెలిపారు. అయితే, ప్రభుత్వ తీరును శ్రీలంక తమిళులు వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. శ్రీలంక మలైయగ మక్కల్ మున్నణి అధ్యక్షుడు కూడా అయిన రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుచ్చిని సందర్శించారు.

ఈ సందర్భంగా ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిద్దీన్ నివాసంలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని శ్రీలంక శరణార్థుల శిబిరాలను పునరావాసాలుగా మార్చడంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆయన అభినందించారు. శ్రీలంకలో తమిళులు నివసించే ప్రాంతంలో భారత్ 50 వేల ఇళ్లు నిర్మించిందని తెలిపారు. అంతేకాక, ఓ రైలు మార్గాన్ని, విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. చైనా తమ దేశంలో 500 హెక్టార్లలో పోర్టును ఏర్పాటు చేస్తోందని, దాదాపు 70 శాతం పనులు కూడా పూర్తయ్యాయని రాధాకృష్ణన్ వివరించారు.

More Telugu News