CM Jagan: నాడు-నేడు రెండో దశ పనులపై సీఎం జగన్ సమీక్ష

CM Jagan reviews Nadu Nedu works second phase
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో నాడు-నేడు రెండో దశ పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

నాడు-నేడు రెండో దశ పనులకు టెండర్ల ప్రక్రియను వెంటనే షురూ చేయాలని ఆదేశించారు. పాఠశాలల నిర్వహణ, టాయిలెట్ల పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని స్పష్టం చేశారు. నాడు-నేడు కార్యక్రమంలో ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నామని, అలాంటప్పుడు స్కూళ్లలో మౌలిక వసతులు, ఇతర సదుపాయాలు నాణ్యమైన రీతిలో ఉండాలని, తప్పనిసరిగా పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్నారు.

పాఠశాలల అంశంలో నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ పాతరోజుల్లోకి వెళతామని హెచ్చరించారు. ప్రతి పాఠశాలలోనూ కంటింజెంట్ ఫండ్ ఏర్పాటు చేయాలని, పాఠశాలల్లో మరమ్మతులు, సమస్యల పరిష్కారానికి ఆ ఫండ్ వినియోగించాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

అటు, జగనన్న విద్యాకానుక పథకంపైనా సీఎం అధికారులతో చర్చించారు. విద్యాకానుకలో భాగంగా అందించే వస్తువుల నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం నుంచి విద్యాకానుక ద్వారా స్పోర్ట్స్ డ్రెస్, స్పోర్ట్స్ షూ కూడా ఇవ్వాలని ఆదేశించారు.
Go Back to Shorts
CM Jagan
Nadu-Nedu
Second Phase
YSRCP
Andhra Pradesh

More Telugu News