700 మంది తాలిబన్లను మట్టుబెట్టిన పంజ్​ షీర్​ ప్రతిఘటన దళాలు

National Resistance Forces Killed 700 Talibans
  • మరో 600 మందిని బంధించామని వెల్లడి
  • కపీసా సరిహద్దులకు తరిమేశామని కామెంట్
  • పంజ్ షీర్ లోని నాలుగు జిల్లాలను ఆక్రమించామన్న తాలిబన్లు
తాలిబన్లకు పంజ్ షీర్ ప్రతిఘటన దళాలు గట్టిపోటీనిస్తున్నాయి. ప్రావిన్స్ తాలిబన్ల వశం కాకుండా ఉండేందుకు శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి. అయితే, తాలిబన్లు మాత్రం పంజ్ షీర్ రాజధాని బజారక్ లోకి ప్రవేశించామని, ప్రావిన్స్ గవర్నర్ ఆఫీసును ఆక్రమించామని ప్రకటించుకున్నారు. ప్రావిన్స్ లోని అనాబా, షుతూల్ జిల్లాలను ఆక్రమించుకున్నామని చెప్పారు. వాటితో పాటు ఖంజ్, ఉనాబా జిల్లాలనూ తమ అధీనంలోకి తెచ్చుకున్నామని తాలిబన్ల ప్రతినిధి బిలాల్ కరీమి చెప్పారు. ప్రావిన్స్ లోని ఏడు జిల్లాల్లో నాలుగు తాలిబన్ల నియంత్రణలోకి వచ్చాయన్నారు.

అయితే, నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ అధికారులు మాత్రం.. తాలిబన్లను తరిమికొట్టామని ప్రకటించారు. కపీసా ప్రావిన్స్ సరిహద్దుల వరకు వారిని తరిమామని చెప్పారు. ఖవక్ పాస్ లో వేలాది మంది ఉగ్రమూకలను చుట్టుముట్టామని, 700 మంది తాలిబన్లను మట్టుబెట్టామని ప్రకటించారు. మరో 600 మంది తాలిబన్లను బంధించామని చెప్పారు. శనివారం రాత్రి నుంచి పంజ్ షీర్ లోని పర్యాన్ లో హోరాహోరీ సాగిందని ప్రకటించారు. అహ్మద్ మసూద్ నేతృత్వంలోని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ దళాలు తాలిబన్లను దీటుగా ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తమ దెబ్బకు ఉగ్రమూకలు ఆయుధాలు, యుద్ధ ట్యాంకులను వదిలి పరారయ్యాని చెప్పారు.
Go Back to Shorts
Afghanistan
Taliban
Resistance Forces
Panjshir

More Telugu News