Chandrababu: చంద్రబాబును కలిసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Buchhaiah Chowdary meets Chandrababu
  • పార్టీ పరిస్థితులపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన నేత
  • విషయం కనుగొనేందుకు త్రిసభ్య కమిటీ వేసిన పార్టీ అధిష్ఠానం
  • చంద్రబాబును కలవడంపై సర్వత్ర ఆసక్తి
ఇటీవల తెలుగు దేశం పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే, పొలిట్‌బ్యూరో సభ్యుడు అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తికి కారణం కనుక్కోవడం కోసం ఇటీవల పార్టీ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ నేపథ్యంలోనే మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన బుచ్చయ్య చౌదరి.. చంద్రబాబును కలిశారు.

ఆయన వెంట టీడీపీ నేతలు చినరాజప్ప, నల్లమిల్లి, గద్దె రామ్మోహన్, జవహర్ తదితరులు ఉన్నారు. పార్టీపై బుచ్చయ్య చౌదరి అలకబూనడాన్ని సీరియస్‌గా తీసుకున్న అధిష్ఠానం.. విషయం తెలుసుకోవడం కోసం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కె.ఎస్. జవహర్‌లతో కమిటీ వేసింది.

వీరంతా బుచ్చయ్య నివాసానికి వెళ్లి ఆయనతో రెండున్నర గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆయన అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ విషయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే చంద్రబాబును కలిసేందుకు బుచ్చయ్య మంగళగిరి వచ్చారు. ఈ సమావేశం తర్వాత సమస్య ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. 

More Telugu News

Chandrababu
Gorantla Butchaiah Chowdary
Telugudesam
Nimmakayala Chinarajappa