Telangana: తెలంగాణలో నేటి నుంచి రిజిస్ట్రేషన్ ఫీజులు, వినియోగ చార్జీల పెంపు అమల్లోకి

  • ఇటీవల రిజిస్ట్రేషన్, ఇతర సేవల చార్జీల పెంపు 
  • గతంలో రూ. 500 ఉన్న సొసైటీ రిజిస్ట్రేషన్ రుసుము ఇప్పుడు రూ. 2 వేలకు పెంపు
  • సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ కోసం రూ. 5 వేల ఫీజు
  • జీపీఏ ఫీజు రూ. 5 వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్షకు పెంపు
Land Registration new fees commence from Today

రిజిస్ట్రేషన్, వినియోగ చార్జీలు, ఆ శాఖ అందించే ఇతర సేవల ఫీజులను ఇటీవల పెంచిన తెలంగాణ ప్రభుత్వం పెరిగిన రుసుములు నేటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు నిన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రూ. 500గా ఉన్న సొసైటీ  రిజిస్ట్రేషన్ చార్జీ తాజా పెంపు కారణంగా రూ. 2 వేలకు పెరగ్గా, సొసైటీల డాక్యుమెంట్ల ఫైలింగుకు ఉన్న రూ. 300 ఫీజును 1000 రూపాయలకు పెంచింది.

అగ్రిమెంట్ ఆఫ్ సేల్, జీపీఏలకు గతంలో రూ. 2 వేలు ఉండగా దానిని కనిష్ఠంగా రూ. 5 వేలు, గరిష్ఠంగా రూ. లక్ష రూపాయలకు పెంచింది. వీటితోపాటు ఇతర చార్జీలను పెంచిన ప్రభుత్వం సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనుకుంటే రూ. 5 వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే, రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం కుటుంబ సభ్యులంటే ఎవరో కూడా వివరించింది. ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం.. తండ్రి, తల్లి, భర్త, భార్య, సోదరుడు, అక్క, కొడుకు, కుమార్తె, తాత, అవ్వ, మనవలు, దత్తత తీసుకున్న కుమారుడు, కుమార్తె, తల్లి, తండ్రిగా పేర్కొంది.

More Telugu News