Bandi Sanjay: స్థ‌లాలు క‌బ్జా చేసి ఫంక్ష‌న్ హాళ్లు క‌డుతున్నారు: బండి సంజ‌య్‌ ఆరోపణలు

  • రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోంది
  • టీఆర్‌ఎస్‌ మెడలు వంచుతాం
  • టీఆర్‌ఎస్‌, ఎంఐఎం రెండూ ఒక్కటే
  • ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్‌ బయటకు వస్తారు
bandi sanjay slams trs

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా ఈ రోజు ఆయ‌న హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని ఆరోపించారు. తాము టీఆర్‌ఎస్‌ మెడలు వంచుతామ‌ని చెప్పారు.

టీఆర్‌ఎస్‌, ఎంఐఎం రెండూ ఒక్కటేనని బండి సంజ‌య్ అన్నారు.  మ‌జ్లిస్‌తో క‌లిసి టీఆర్ఎస్ నేత‌లు స్థ‌లాలు క‌బ్జాలు చేసి ఫంక్ష‌న్ హాళ్లు క‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్క‌డైనా ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్‌ బయటకు వస్తారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో తాను చేస్తోన్న పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకునే అవకాశం వ‌చ్చింద‌ని బండి సంజ‌య్ తెలిపారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ సమస్యలను చెబుతున్నార‌ని ఆయ‌న అన్నారు.  పేదల గురించి ఆలోచించే పరిస్థితిలో టీఆర్‌ఎస్ ప్ర‌భుత్వం లేదని విమ‌ర్శించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం పేరును టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చేసిందని, కేంద్ర స‌ర్కారు ఇచ్చిన నిధులతోనే డబుల్ బెడ్‌రూం ఇళ్లు కడుతున్నారని ఆరోపించారు.

ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే పథకం పేరును మార్చేశారని ఆయ‌న చెప్పారు. తెలంగాణ‌లో కాంట్రాక్టర్ల కమిషన్‌ కోసమే ఇళ్లు కడుతున్నారని ఆయ‌న ఆరోపించారు. వాటి నాణ్యతను ఇప్పటి వరకు కేసీఆర్ పరిశీలించలేదని ఆయ‌న చెప్పారు. ప్రధాని ఆవాస్‌ యోజన ఇళ్ల జాబితా ఇవ్వాల‌ని కోరితే  అభ్యంతరమేంటని ఆయ‌న నిల‌దీశారు.  

More Telugu News