హత్యకేసు నిందితురాలిపై ప్రతీకారం.. వివస్త్రను చేసి, కంట్లో కారం కొట్టి వీధుల్లో తిప్పుతూ అరాచకం!

Brutal Attack on a woman in suryapet dist
  • సూర్యాపేట జిల్లాలో ఘటన
  • దాదాపు గంటపాటు కొనసాగిన అరాచకం
  • తప్పించుకుని ఎంపీటీసీ సభ్యురాలి ఇంటికి పరుగులు తీసిన మహిళ
  • దుస్తులు కప్పి రక్షణ కల్పించిన ఎంపీటీసీ సభ్యురాలు
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో అత్యంత దారుణం జరిగింది. ఓ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళపై పాశవిక దాడి జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగా అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..

సూర్యాపేట మండలం రాజునాయక్‌తండాకు చెందిన శంకర్‌నాయక్ జూన్ 13న హత్యకు గురయ్యాడు. దర్యాప్తు చేసిన పోలీసులు అదే ఊరికి చెందిన మహిళను అరెస్ట్ చేశారు. ఇటీవల ఆమె బెయిలుపై విడుదలై గ్రామానికి వచ్చింది. హత్యకు గురైన శంకర్‌నాయక్ బంధువులతో ఆమెకు పాతకక్షలు ఉండడంతో ఆమె తన సోదరి ఇంట్లో ఉంటోంది.

ఈ క్రమంలో తండాలో బంధువు ఒకరు మృతి చెందడంతో శనివారం అక్కడికి వెళ్లింది. ఆమెను అక్కడ చూసి కోపంతో ఊగిపోయిన శంకర్‌నాయక్ బంధువులు ఆమెను పట్టుకుని దాడిచేశారు. ఇంట్లోంచి బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేశారు. ఆపై కళ్లలో కారంపోసి, కర్రలతో కొడుతూ నగ్నంగా వీధుల్లో తిప్పారు. దాదాపు గంటసేపు ఈ పాశవిక దాడి జరిగింది. అందరూ కళ్లప్పగించి చూశారు తప్పితే ఒక్కరు కూడా అడ్డుకోవడానికి ముందుకు రాకపోవడం గమనార్హం.

ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకున్న మహిళ ఎంపీటీసీ సభ్యురాలు శాంతాబాయి ఇంటికి పరుగులు తీసింది. శాంతాబాయి ఆమె ఒంటిపై దుస్తులు కప్పి రక్షణ కల్పించింది. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకుని, బాధిత మహిళను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Go Back to Shorts
Suryapet District
Woman
Attacked
Telangana

More Telugu News