Afghanistan: తాలిబన్ల వెనుక పాకిస్థాన్ ఉంది.. ఇండియా చాలా గొప్పది: పాప్ స్టార్ ఆర్యానా సయీద్

  • తాలిబన్లకు ట్రైనింగ్ ఇచ్చింది పాకిస్థానే
  • పాక్ పై ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచాలి
  • ఇండియా నిజమైన మిత్రుడు
Afghan Pop Star Aryana Sayeed fires on Pakistan and praises India

ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ప్రముఖ పాప్ స్టార్ ఆర్యానా సయీద్ పాకిస్థాన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. తాలిబన్లు కాబూల్ ను ఆక్రమించుకున్న వెంటనే ఆమె దేశ సరిహద్దులు దాటేశారు. ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారనే విషయం ఎవరికీ తెలియదు. గుర్తు తెలియని ప్రాంతం నుంచి ఏఎన్ఐకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

తాలిబన్లను పెంచి పోషించింది పాకిస్థానే అని ఆమె అన్నారు. తాలిబన్ ఎదుగుదల వెనుక పాకిస్థాన్ ఉందని చెప్పే ఎన్నో వీడియోలను, ఆధారాలను తాను చూశానని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ వ్యవహారాల్లో పాకిస్థాన్ ఇంకెంత మాత్రం జోక్యం చేసుకోరాదని తెలిపింది.

తాలిబన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది పాకిస్థానే అని ఆర్యానా మండిపడ్డారు. పాకిస్థాన్ లో తాలిబన్ల బేస్ లు ఉన్నాయని... అక్కడే వారికి పాక్ ట్రైనింగ్ ఇస్తుందని చెప్పారు. పాకిస్థాన్ కు ఆర్థిక సహాయం చేయకూడదని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నానని అన్నారు. పాకిస్థాన్ కు నిధులు అందిస్తే... తాలిబన్లకు పాకిస్థాన్ ఫండింగ్ చేస్తుందని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్థాన్ లో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని చెప్పారు. పాకిస్థాన్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాలని సూచించారు. పాకిస్థాన్ వల్లే ఆప్ఘనిస్థాన్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు.
 
ఆఫ్ఘనిస్థాన్ కు భారత్ నిజమైన స్నేహితుడని ఆర్యానా చెప్పారు. తమ దేశానికి ఇండియా ఎంతో సాయం చేసిందని కొనియాడారు. ఆఫ్ఘన్ నిరాశ్రయుల పట్ల ఎంతో జాలి, కరుణ చూపిందని అన్నారు. ఇండియాలో ఉన్న ఆఫ్ఘన్లందరూ ఆ దేశాన్ని ఎంతో పొగుడుతారని చెప్పారు. భారత్ కు తాము ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు.

More Telugu News