Revanth Reddy: చంద్రబాబు, కేసీఆర్ లాంటి వాళ్లు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే: రేవంత్ రెడ్డి

  • కాంగ్రెస్ ఎందరో నాయకులను తయారు చేసింది
  • వైయస్, చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలను యూత్ కాంగ్రెస్ అందించింది
  • కష్టపడి పని చేసేవారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది
Chandrababu and KCR also came from Congress says Revanth Reddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది నాయకులను తయారు చేసిందని ఆయన చెప్పారు. చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవారేనని అన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతలను యూత్ కాంగ్రెస్ అందించిందని చెప్పారు.

ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలకు టికెట్లు కేటాయించాలంటే... ముందు ప్రజల కోసం ప్రభుత్వం మీద ఏం కొట్లాడారో చూస్తామని రేవంత్ అన్నారు. టికెట్ తీసుకుని జనాల్లోకి వెళ్తామని భావించేవాళ్లు గెలవలేరని చెప్పారు. కష్టపడి పని చేసేవారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని చెప్పారు. ఎవరు కష్టపడితే వాళ్లే కాంగ్రెస్ పార్టీకి ఓనర్స్ అని తెలిపారు. కష్టపడి పని చేయడానికి నేతలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

పార్టీ కోసం కష్టపడితే ఇంటికే వచ్చి బీఫామ్ అందిస్తానని రేవంత్ చెప్పారు. రానున్న 20 నెలల్లో కష్టపడినదాన్ని బట్టి టికెట్లు ఇస్తామని తెలిపారు. నేను పీసీసీ చీఫ్, నేను జిల్లా అధ్యక్షుడిని అని అడిగితే టికెట్లు ఇవ్వబోమని... పనిచేసే వాళ్లే టికెట్లు అడగాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉందని... సంక్షోభ సమయంలోనే నాయకులు పుట్టుకొస్తారని చెప్పారు.

More Telugu News