Afghanistan: 150 మంది భారతీయులను కిడ్నాప్ చేసిన తాలిబన్లు!

  • కాబూల్ విమానాశ్రయంలోకి వెళ్లకుండా అడ్డగింత
  • ట్రక్కుల్లో అపహరించిన వైనం
  • దూకి తప్పించుకున్న కొందరు
  • వారిని విడిపించేందుకు తాలిబన్లతో చర్చలు
Talibans Abducted 150 Indians Out Side Kabul Airport

తాలిబన్లు 150 మంది భారతీయులను కిడ్నాప్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్ లోని భారతీయులను కేంద్ర ప్రభుత్వం తరలిస్తున్న క్రమంలో అక్కడ చిక్కుకున్న చాలా మంది కాబూల్ విమానాశ్రయానికి వచ్చారు. అయితే, అక్కడ ఉన్న తాలిబన్లు వారిని లోపలికి అనుమతించలేదు. అక్కడి వార్తా సంస్థల కథనాల ప్రకారం.. వేరే గేటు నుంచి వెళ్లాలని చెప్పి తాలిబన్లు ట్రక్కులెక్కించారని, తీరా అక్కడకు తీసుకెళ్లకుండా వేరే చోటుకు తీసుకెళ్లిపోయారని తెలుస్తోంది. ఈ క్రమంలో కొందరు ట్రక్కుల్లో నుంచి దూకేశారని చెబుతున్నారు.

ప్రస్తుతం ఉగ్రవాదుల చెరలో ఉన్న భారతీయుల ప్రాణాలకు ఎలాంటి హాని లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు పరోక్ష చర్చలు సాగుతున్నాయని విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. వారిని స్థానిక పోలీస్ స్టేషన్లలో విచారిస్తున్నారని అంటున్నారు. అయితే, అక్కడి వార్తా సంస్థల కథనాల ప్రకారం వారిని ఎయిర్ పోర్ట్ కు సమీపంలోని ఓ గ్యారేజీలో ఉంచినట్టు తెలుస్తోంది. వారి పాస్ పోర్టులు, ప్రయాణ పత్రాలను చెక్ చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం కాబూల్ లో భారత రాయబార కార్యాలయం కూడా లేనందున.. వారి విడుదలపై ఆందోళన నెలకొంది. వీలైనంత త్వరగా వారిని విడిపించి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మరోపక్క, ఆ దేశంలోని వివిధ నగరాల్లో దాదాపు వెయ్యి మంది భారతీయులు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. వారందరినీ విమానాశ్రయానికి తీసుకొచ్చి.. భారత్ కు తరలించాలంటే కేంద్ర ప్రభుత్వానికి సవాలుతో కూడుకున్న వ్యవహారమేనని అంటున్నారు. ఇవాళ ఉదయం వీలైనంత ఎక్కువ మంది భారతీయులను కాబూల్ విమానాశ్రయానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని చెబుతున్నారు. వారి తరలింపు కోసం సీ17 ఆర్మీ విమానాన్ని ఢిల్లీలో సిద్ధంగా ఉంచినట్టు సమాచారం.

More Telugu News