Errabelli: కిషన్ రెడ్డి హుందాగా ఉండాలి.. ఇలా చిల్లర రాజకీయాలు చేయ‌కూడ‌దు: మంత్రి ఎర్ర‌బెల్లి

  • ఇకనైనా కిషన్‌రెడ్డి పిచ్చి వ్యాఖ్య‌లు ఆపేయాలి
  • తెలంగాణ‌ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు
  • రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టునూ తీసుకురాలేదు
  • కిష‌న్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి అస‌త్యాలు మాట్లాడుతున్నారు
errabelli slams kishan reddy

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో పాటు బీజేపీ తెలంగాణ ఎంపీల‌పై రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు మండిప‌డ్డారు. కిషన్ రెడ్డి హుందాగా ఉండాలని, ఆయ‌న‌ చిల్లర రాజకీయాలు చేయ‌కూడ‌ద‌ని ఎర్ర‌బెల్లి అన్నారు. తెలంగాణలో ప‌ర్యాట‌క అభివృద్ధికి కేంద్ర స‌ర్కారు ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా? అని నిల‌దీశారు.

ఇకనైనా కిషన్‌రెడ్డి పిచ్చి వ్యాఖ్య‌లు ఆపేయాలని ఆయ‌న వ్యాఖ్యానించారు. తెలంగాణ‌ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు, ఓ కేంద్ర మంత్రి ఉన్నప్ప‌టికీ రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టునూ తీసుకురాలేద‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణకు వారు చేసిందేమిటని నిల‌దీశారు. కిష‌న్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి అస‌త్యాలు మాట్లాడుతున్నార‌ని విమర్శించారు.

మిషన్‌ భగీరథను కేంద్ర ప్ర‌భుత్వం ఆదర్శంగా తీసుకుందని, అయితే ఆ ప్రాజెక్టుకు కేంద్ర స‌ర్కారు నిధులు ఇవ్వలేదని విమ‌ర్శించారు. తెలంగాణ‌లో అమలు చేస్తున్నన్ని సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని నిల‌దీశారు. విభజన చట్టంలో ఉన్న కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీతో పాటు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర స‌ర్కారు ఇవ్వలేదని ఆయ‌న చెప్పారు.

More Telugu News