Kishan Reddy: ఏపీ ప్రభుత్వం బీజేపీ శ్రేణులను వేధిస్తోంది: కిషన్ రెడ్డి

  • ఏపీలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి
  • తిరుపతి నుంచి విజయవాడ రాక
  • కిషన్ రెడ్డి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
  • కాసేపట్లో సీఎం జగన్ ను కలవనున్న కిషన్ రెడ్డి
Kishan Reddy fires on AP Govt

ఏపీ సర్కారుపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. ఆయన తిరుపతి నుంచి విజయవాడ చేరుకున్నారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం బీజేపీ శ్రేణులను వేధిస్తోందని ఆరోపించారు. పార్లమెంటులో పనిచేయనీయకుండా తమను అడ్డుకున్నారని తెలిపారు. అందుకే ప్రజల్లోకి వచ్చి జన ఆశీర్వాద యాత్ర చేపట్టామని వివరించారు.

అనేక అంశాల్లో ఏపీకి ప్రాధాన్యత కింద నిధులు ఇచ్చామని వెల్లడించారు. ఏపీకి నిధుల విషయంలో కేంద్రంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసంతృప్తి వెలిబుచ్చారు. వ్యక్తులు, కుటుంబాల ఆధారంగా నడిచే పార్టీలను నమ్మవద్దని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలకు వ్యక్తిగత స్వార్థం తప్ప విశాల దృక్పథం ఉండదని విమర్శించారు. కాగా, కాసేపట్లో కిషన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలవనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News