Air India Plane: కాబూల్ నుంచి 129 మంది ప్రయాణికులతో ఢిల్లీ చేరుకున్న ఎయిరిండియా విమానం

  • ఆఫ్ఘన్ పై పట్టు సాధించిన తాలిబాన్లు
  • రాజధాని కాబూల్ కూడా స్వాధీనం
  • ఈ ఉదయం కాబూల్ వెళ్లిన ఎయిరిండియా విమానం
  • గంట ఆలస్యంగా ల్యాండింగ్
Air India plane from Kabul lands in Delhi

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ తాలిబాన్ల గుప్పిట్లో చిక్కుకుంది. ఇప్పటికే వారు అధ్యక్ష భవనాన్ని ఆక్రమించారు. ఆపై ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకునేందుకు భారీ ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. ఆఫ్ఘన్ లో అరాచక పరిస్థితులు ఏర్పడడంతో విదేశీయులు అక్కడ్నించి నిష్క్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కాబూల్ నుంచి 129 మంది ప్రయాణికులతో ఎయిరిండియా విమానం కొద్దిసేపటి కిందట ఢిల్లీ చేరుకుంది.

సాధారణంగా ఎయిరిండియా విమానం ఢిల్లీ-కాబూల్ మధ్య వారానికి మూడు పర్యాయాలు తిరుగుతుంది. అయితే కాబూల్ పై తాలిబాన్లు పట్టు సాధించిన నేపథ్యంలో, ఈ విమాన సర్వీసుపై అనిశ్చితి ఏర్పడింది. ఈ ఉదయం ఎయిరిండియా విమానం ఢిల్లీ నుంచి బయలుదేరి కాబూల్ చేరుకుంది. అయితే తాలిబాన్లు నగరంలోకి ప్రవేశించడంతో ఓ గంట ఆలస్యంగా ల్యాండైంది. కాబూల్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారు. ఈ విమానం తిరిగి సాయంత్రం 6.06 గంటలకు కాబూల్ లో బయల్దేరి రాత్రి 8 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకుంది.

ఇప్పటిదాకా కాబూల్ ఎయిర్ పోర్టు ఒక్కటే ఆఫ్ఘన్ నుంచి నిష్క్రమించేందుకు మార్గంగా ఉంది. తాలిబాన్లు ఇప్పుడు ఎయిర్ పోర్టును కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో, ఇక ఆ దేశం నుంచి బయటపడడం ఏమంత సులువుకాదు. ఈ విషయం తెలిసే ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఈ మధ్యాహ్నమే దేశం విడిచి కొందరు అధికారులతో కలిసి తజకిస్థాన్ వెళ్లిపోయారు.

కాగా, అగ్రరాజ్యం అమెరికా తన దౌత్య సిబ్బందిని ఇప్పటికే ఆఫ్ఘన్ నుంచి తరలించింది. బ్రిటన్ కూడా తన పౌరులను సురక్షితంగా తరలించేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది. నాటో సిబ్బంది కూడా ఆఫ్ఘన్ లోని భద్రమైన స్థావరాల్లోకి చేరుకున్నట్టు తెలుస్తోంది. భారతీయులు ఆఫ్ఘన్ నుంచి తిరిగొచ్చేయాలని కేంద్రం కొన్నిరోజుల ముందే అప్రమత్తం చేసింది.

More Telugu News