Nara Lokesh: సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం రాష్ట్రంలోని మహిళలకు ఇంకేం రక్షణ కల్పిస్తారు?: నారా లోకేశ్

  • గుంటూరులో బీటెక్ విద్యార్థిని హత్య
  • ఘాటుగా స్పందించిన లోకేశ్
  • చేతగాని సీఎం అంటూ వ్యాఖ్యలు
  • మృగాడికి శిక్ష పడాలంటూ డిమాండ్
Nara Lokesh reacts furiously after Btech student Ramya murder

గుంటూరులో రమ్య అనే బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురికావడం పట్ల టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. సొంత చెల్లికే రక్షణ కల్పించలేని సీఎం రాష్ట్రంలోని మహిళలకు ఇంకేం రక్షణ కల్పిస్తారని విమర్శించారు. దిశ చట్టం అంటూ జగన్ బిగ్గరగా అరవడం, వైసీపీ బ్యాండ్ బ్యాచ్ ఈలలు, కేకలు వెయ్యడం తప్ప ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరిగింది లేదు అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

సీఎం ఇంటి పక్కన, సొంత నియోజకవర్గంలోనూ మహిళలపై అత్యాచారాలు జరిగితే ఇప్పటిదాకా నిందితులను పట్టుకోలేకపోవడం జగన్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగన్ రెడ్డి దిశ చట్టం, మహిళల రక్షణ అంటూ ఉపన్యాసం ఇస్తున్న సమయంలోనే గుంటూరులో దళిత యువతి రమ్యను ఓ మృగాడు అత్యంత కిరాతకంగా హత్యచేశాడని లోకేశ్ వెల్లడించారు.

బంగారు భవిష్యత్ పొందాల్సిన రమ్య జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం బాధాకరమని, సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. రమ్యను హత్య చేసిన మృగాడికి కఠినశిక్ష పడాలని డిమాండ్ చేశారు.

More Telugu News