Neeraj Chopra: జావెలిన్​ త్రోలో నీరజ్​ కు ప్రపంచ రెండో ర్యాంక్​.. ఒలింపిక్స్​ లో 9వ స్థానంలో నిలిచిన ‘మొదటి ర్యాంకర్’​!

  • స్వర్ణ పతకంతో 14 స్థానాలు ఎగబాకిన నీరజ్
  • అంతకుముందు 16వ ర్యాంక్
  • ఒలింపిక్స్ లో నీరజ్ కు కనీస పోటీ ఇవ్వని మొదటి ర్యాంకర్
  • 2021లో 7 సార్లు 90 మీటర్లు విసిరిన వెట్టర్
Neeraj Gets World No 2 After Olympics Gold

భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే తొలి ఒలింపిక్స్ స్వర్ణాన్ని అందించి రికార్డు సృష్టించిన నీరజ్ చోప్రా.. మరో ఘనత సాధించాడు. అథ్లెటిక్స్ మెన్స్ జావెలిన్ త్రోలో అత్యుత్తమ ప్రపంచ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించడానికి ముందు 16వ ర్యాంకులో ఉన్న అతడు.. ఇప్పుడు 14 స్థానాలు ఎగబాకి ప్రపంచ రెండో ర్యాంకర్ గా నిలిచాడు.

1315 పాయింట్లతో ఉన్న నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. 1396 పాయింట్లతో జర్మనీకి చెందిన జొహానస్ వెట్టర్ మొదటి ర్యాంకులో కొనసాగుతున్నాడు. 2021లో దాదాపు 7 సార్లు బల్లేన్ని 90 మీటర్ల కన్నా ఎక్కువ దూరం విసిరిన అతడు తొలి స్థానంలో ఉన్నాడు. వాస్తవానికి టోక్యో ఒలింపిక్స్ లో వెట్టర్ కే గోల్డ్ వస్తుందని అంతా భావించారు.

కానీ, అతడు నీరజ్ దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఒలింపిక్స్ లో 90 మీటర్ల దూరం ఖాయం అని అనుకున్నా.. కేవలం 82.52 మీటర్ల దూరమే విసిరి 9వ స్థానంలో నిలిచాడు. కనీసం రజతం, కాంస్య పతకాలనూ అతడు సాధించలేకపోవడం గమనార్హం. ఇక, పోలండ్ కు చెందిన మార్సిన్ క్రుకోవ్ స్కీ మూడో స్థానంలో నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత యాకూబ్ వాద్లెచ్ నాలుగు, జర్మనీకి చెందిన జూలియన్ వీబర్ ఐదో ర్యాంకులను దక్కించుకున్నారు.

More Telugu News