Shivsena: రాజీవ్ ఖేల్ రత్న పేరు మార్పుపై శివసేన స్పందన

  • ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చిన కేంద్రం
  • కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన శివసేన
  • ఇదొక రాజకీయ క్రీడ అంటూ వ్యాఖ్యలు
  • రాజీవ్ త్యాగాన్ని తక్కువ చేసి చూడరాదని వెల్లడి
Shivsena opines on Khel Rathna name change

దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న పేరును హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ పేరిట ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా పేరు మార్చడంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కేంద్రం నిర్ణయం పట్ల శివసేన విమర్శలు చేసింది. ఖేల్ రత్న పేరు మార్పు అంశం రాజకీయ క్రీడలో భాగమని ఆరోపించింది. రాజీవ్ ఖేల్ రత్న ను ధ్యాన్ చంద్ పేరిట మార్చడం వెనుక ప్రజాభిప్రాయాలు ఏమీ లేవని పేర్కొంది.

దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేశారని, వారి త్యాగాలను తక్కువ చేసి చూడడం సరికాదని శివసేన పేర్కొంది. ఒకవేళ ధ్యాన్ చంద్ ను గౌరవించాలనుకుంటే అందుకు రాజీవ్ గాంధీని అవమానించాల్సిన అవసరం లేదని శివసేన అభిప్రాయపడింది. క్రికెట్ క్రీడకు మోదీ ఏంచేశారని అహ్మదాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియానికి తన పేరు పెట్టుకున్నారని ప్రజానీకం ప్రశ్నిస్తోందని పేర్కొంది. ఒలింపిక్స్ లో భారత్ కు తొలి పతకం తెచ్చిన ఖషబా జాదవ్ పేరిట ఖేల్ రత్న పేరు మార్చవచ్చు కదా? అని ప్రశ్నించింది.

క్రీడారంగానికి బడ్జెట్ లో రూ.300 కోట్ల మేర కోత విధించిన మోదీ సర్కారు టోక్యోలో భారత ప్రదర్శనను తన విజయంగా చెప్పుకుంటోందని శివసేన విమర్శించింది. ఈ మేరకు పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం వెలువరించింది.

More Telugu News