Vishnu Vardhan Reddy: కాణిపాకంలో ప్రమాణం చేద్దాం రా.... వైసీపీ ఎమ్మెల్యేకి సవాల్ విసిరిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  • ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం
  • హిందూ ద్రోహి అంటూ విష్ణు వ్యాఖ్యలు
  • విష్ణు పెద్ద దొంగ అంటూ రాచమల్లు కౌంటర్
  • పుట్టపర్తిలో డబ్బు, బంగారం దోచాడని వెల్లడి
  • ఈ నెల 10న ప్రమాణం చేద్దామన్న విష్ణు
Vishnu challenges YCP MLA Rachamallu Sivaprasad Reddy

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి (ప్రొద్దుటూరు) మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం తీవ్రస్థాయికి చేరింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ ద్రోహి టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించడంతో రగడ మొదలైంది. శివప్రసాద్ రెడ్డి హింసను ప్రేరేపిస్తున్నారని అన్నారు.

దాంతో మండిపడిన శివప్రసాద్ రెడ్డి.... విష్ణువర్ధన్ రెడ్డి మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పెద్ద దొంగ అని, పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమంలో డబ్బు, బంగారం దోచేశాడని శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేవారు. ఈ నేపథ్యంలో, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ నెల 10న కాణిపాకం వినాయక ఆలయంలో ప్రమాణం చేద్దాం రా...  అని ఓ ప్రకటన చేశారు.

తాను ఇంతకుముందే విశాఖ మీడియా సమావేశంలో ప్రమాణం చేసే అంశం ప్రతిపాదించానని, కానీ రాచమల్లు డొంకతిరుగుడు సమాధానాలతో తప్పించుకుంటున్నారని విష్ణు వ్యాఖ్యానించారు. అందుకే తానే తేదీని ప్రకటిస్తున్నానని, ఆగస్టు 10వ తేదీ ఉదయం 11 గంటలకు కాణిపాకంలో స్వామివారి సన్నిధికి తాను వస్తానని, శివప్రసాద్ రెడ్డి కూడా వచ్చి ఆరోపణలపై ప్రమాణం చేయాలని స్పష్టం చేశారు.

ఒకవేళ ఆ రోజున రాకపోతే శివప్రసాద్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును సమాజమే నిర్ణయిస్తుందని తెలిపారు. శివప్రసాద్ రెడ్డి వచ్చినా, రాకపోయినా తాను మాత్రం కాణిపాకం వచ్చి దేవుడి ముందు తన నిజాయతీ నిరూపించుకుంటానని విష్ణు స్పష్టం చేశారు.

More Telugu News