Vijayashanti: కేవలం హుజూరాబాద్ ఎన్నిక వస్తుందన్న భయంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారు: విజ‌య‌శాంతి

  • ఎమ్మెల్సీ ఎన్నికల నుండి తప్పించుకుని వాయిదా వేసే ప్రయత్నం
  • ఇంకా సమయం దొరికితే మరిన్ని మోసపు పథకాలు తీసుకొస్తారు
  • నాయకులను కొనుగోలు చేస్తారు
  • బీజేపీ కార్యకర్తలను ఒత్తిళ్ల‌కు గురి చేసే విధంగా కేసులు పెడ‌తారు
vijaya shanti slams trs

తెలంగాణ‌లోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గ ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీఆర్ఎస్‌పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ స్థానంలో ఈటల రాజేంద‌ర్ విజ‌యం సాధిస్తార‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

'ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సంసిద్ధతపై ప్రశ్నిస్తే తమ వల్ల కాదని కేసీఆర్ గారి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుని మంచి గాలప్ మీద భాగ్ మిల్కా లెక్క ఉరుకుతున్నట్లు వార్తలు వస్తున్నాయి' అని విజ‌య‌శాంతి పేర్కొన్నారు.

'గతంలో కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎంత చెప్పినా వినకుండా మిలియన్ల సంఖ్యలో ఓటర్లు పాల్గొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించిన ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కేవలం 100కు పైన ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేయ‌వ‌లసిన ఎమ్మెల్సీ ఎన్నికల నుండి తప్పించుకుని వాయిదా వేసే ప్రయత్నం కేవలం హుజూరాబాద్ ఎన్నిక వస్తుందన్న భయంతో మాత్రమే' అని విజ‌య‌శాంతి  ట్వీట్ చేశారు.

'ఇంకా సమయం దొరికితే మరిన్ని మోసపు పథకాలు తెచ్చి, నాయకులను కొనుగోలు చేసి, బీజేపీ కార్యకర్తలను ఒత్తిళ్ల‌కు గురి చేసే విధంగా కేసులు, వేధింపులు చేపట్టి, ప్రజలను భయభ్రాంతులను చేసి, ఎలాగైనా గెలవాలన్న దుర్మార్గపు ఆలోచనలో భాగంగానే ఈ పలాయనవాదాన్ని ప్రస్తుతానికి అడ్డు పెట్టుకున్నట్లుంది' అని విజ‌య‌శాంతి విమ‌ర్శించారు.

'ఈ పనులన్నిటి ద్వారా ఇప్పటికే జనం దృష్టిలో తేలికైపోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత నవ్వుల పాలు కాక తప్పదు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా హుజూరాబాద్‌లో ఈటల గారి గెలుపు, టీఆర్ఎస్ ఓటమి ఖాయం' అని విజ‌య‌శాంతి పేర్కొన్నారు. ఇప్పటిదాకా చేసిన, చేస్తున్న అరాచక కార్యాచరణ వల్ల టీఆర్ఎస్ ఇప్పటికే ఆ నియోజకవర్గంలో నైతిక ఓటమి పాలైందని చెప్పారు.

More Telugu News