mary kom: 40 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్‌లో కొనసాగుతా: మేరీకోమ్ వ్యాఖ్య‌లు

  • టోక్యో ఒలింపిక్స్‌లో మేరీకోమ్ ఓట‌మి
  • ఇక బ్యాక్సింగ్‌కు గుడ్ బై చెబుతారా? అన్న ప్ర‌శ్న‌కు జ‌వాబు
  • బాక్సింగ్ చేసే స‌త్తా ఇంకా ఉంద‌ని వ్యాఖ్య
mary kom on her defeat

టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్‌ మేరీకోమ్ ప్రీక్వార్టర్స్‌లో ఓడిపోవ‌డంతో నిన్న ఆమె భార‌త్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. బాక్సింగ్‌కు ఇక గుడ్ బై చెప్పేస్తారా? అన్న ప్ర‌శ్న‌కు ఆమె స‌మాధానం చెబుతూ...  తనకు బాక్సింగ్ చేసే స‌త్తా ఇంకా ఉంద‌ని చెప్పారు.

త‌న‌కు 40 ఏళ్లు వచ్చేవరకు ఆడుతూనే ఉంటాన‌ని తెలిపారు. త‌దుప‌రి ఒలింపిక్స్‌లోనూ ఆడేందుకు తాను ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తాన‌ని చెప్పారు.  ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురాలేక‌పోయాన‌ని, ఇందుకు బాధగా ఉంద‌ని చెప్పారు. తాను కచ్చితంగా గెలుస్తాన‌ని భావించాన‌ని అన్నారు. తాను బాగానే ఆడిన‌ప్ప‌టికీ ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లో న్యాయ నిర్ణేతల తీరు సరిగా లేదని చెప్పారు.  

మొద‌టి రెండు రౌండ్లు గెలిచినప్ప‌టికీ తాను ఎందుకు ఓడిపోతానని ప్ర‌శ్నించారు. బౌట్‌కు ముందు అధికారులు త‌న దగ్గరకు వచ్చి సొంత జెర్సీని వాడకూడదని చెప్పార‌ని తెలిపారు. తొలి మ్యాచ్‌లో చెప్పని అభ్యంతరం ప్రీక్వార్టర్స్‌లో ఎందుకు చెప్పారని నిల‌దీశారు. త‌న‌ను మానసికంగా దెబ్బతీయడానికే న్యాయ నిర్ణేత‌లు అలా చేశారని భావిస్తున్న‌ట్లు చెప్పారు.

 

More Telugu News