PV Sindhu: టోక్యో ఒలింపిక్స్.. పతకానికి రెండడుగుల దూరంలో సింధు

  • డెన్మార్క్ క్రీడాకారిణిపై వరుస సెట్లలో విజయం
  • 40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌
  • క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన స్టార్ షట్లర్
  • ఆర్చరీలో అతానుదాస్ ముందంజ
Tokyo Olympics Sindhu wins to enter quarters

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ పీవీ సింధు పతకానికి మరింత చేరువైంది. ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా నేడు డెన్మార్క్‌కు చెందిన 12వ ర్యాంక్ క్రీడాకారిణి బ్లింక్ ఫెల్ట్‌తో జరిగిన పోరులో వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.

తొలి నుంచి దూకుడు ప్రదర్శించిన సింధు.. 21-15, 21-13తో సునాయాస విజయం సాధించింది. మొత్తంగా 40 నిమిషాలపాటు మ్యాచ్ కొనసాగింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని సింధు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. నిన్న జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్‌కు చెందిన 34వ క్రీడాకారిణి నాన్ చూంగ్‌పై విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు చేరిన సింధు.. నేటి మ్యాచ్‌లో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుని పతకానికి రెండడుగుల దూరంలో నిలిచింది.

 కాగా, భారత ఆర్చర్ అతాను దాస్ కూడా ముందడుగు వేశాడు. చైనీస్ తైపీ యు చెంగ్ డెంగ్‌తో జరిగిన పురుషుల వ్యక్తిగత పోరులో విజయం సాధించి రౌండ్-16కి అర్హత సాధించాడు.

More Telugu News