Telangana: తెలంగాణ ఆస్తుల విలువల పెంపు అమల్లోకి.. నేటి నుంచి కొత్త చార్జీలు

New Registration Charges commence from today
  • ‘కార్డ్’ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేసిన అధికారులు
  • ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారి నుంచి కూడా అదనపు చార్జీల వసూలు
  • వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు ఇప్పటికే 30,891 స్లాట్ బుకింగ్
తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుములు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా, నేటి నుంచి ఇది అమలు కానుంది. ఇందుకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ‘కార్డ్’ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేర్పులు చేశారు.

రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేటి నుంచి పెరిగిన విలువలు, చార్జీలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇప్పటికే ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్న వారు అదనపు రుసుము చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలను రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ప్రభుత్వం తాజా పెంపు ప్రకారం.. ఆస్తుల విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చార్జీ 7.5 శాతంగా ఉండగా, గ్రామ పంచాయతీల పరిధిలో ట్రాన్స్‌ఫర్ డ్యూటీ లేకున్నా స్టాంప్ డ్యూటీ 5.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 2 శాతం అమల్లోకి రానున్నాయి.

ఇక, పంచాయతీయేతర ప్రాంతాల్లో స్టాంపు డ్యూటీ 5.5 శాతంగా ఉండగా, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్ రుసుమును 0.5 శాతం వసూలు చేస్తారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు కూడా నేటి నుంచి కొత్త చార్జీలు వసూలు చేయనున్నారు. ఇప్పటికే స్లాటు బుక్ చేసుకున్న వారు 30,891 మంది ఉన్నారు. వీరంతా అదనపు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. పెరిగిన చార్జీలకు అనుగుణంగా ‘ధరణి’ పోర్టల్‌లోనూ మార్పులు చేశారు.

More Telugu News

Telangana
Land Registration
Registration and Stamps Department