Olympics: ‘ఒలింపిక్స్​ గ్రామం’లో కరోనా కలకలం.. ఒకరికి పాజిటివ్​

  • వెల్లడించిన నిర్వహణ కమిటీ
  • ప్రొటోకాల్ లో భాగంగా టెస్టులు
  • పేరు, దేశం వెల్లడించని అధికారులు
  • నిన్ననే ఎయిర్ పోర్టులో నైజీరియా బృంద సభ్యుడికి పాజిటివ్
One Athlete Tests Positive For Covid 19 In Olympics Village

మరో వారంలో ప్రారంభం కావాల్సి ఉన్న ఒలింపిక్స్ కు ఇప్పుడు కరోనా బెంగ పట్టుకుంది. నిన్న మొన్నటిదాకా వివిధ దేశాల్లోని అథ్లెట్లకు, ఒలింపిక్స్ కోసం జపాన్ కు వెళ్తున్న ఓ దేశ బృందంలోని సభ్యుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు అథ్లెట్లుండే ‘ఒలింపిక్స్ గ్రామం’లోనే ఓ కేసు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయాన్ని టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది.

‘‘ఒలింపిక్స్ గ్రామంలో ఓ అథ్లెట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే తొలి కేసు. ప్రొటోకాల్ లో భాగంగా టెస్టులు చేయగా.. ఆ అథ్లెట్ కు కరోనా సోకినట్టు తేలింది’’ అని ఆర్గనైజింగ్ కమిటీ అధికార ప్రతినిధి మాసా తకాయా వెల్లడించారు. ప్రస్తుతం ఆ అథ్లెట్ ను ఐసోలేషన్ లో ఉంచినట్టు చెప్పారు. అతడిని కాంటాక్ట్ అయిన వారిని క్వారంటైన్ లో పెట్టామన్నారు. అయితే, ఆ అథ్లెట్ ఎవరు? ఏ దేశానికి చెందిన వారు? అన్న విషయాలను మాత్రం గోప్యంగా ఉంచారు.

కాగా, నిన్న ఒలింపిక్స్ కోసం టోక్యోకు వచ్చిన నైజీరియన్ ఒలింపిక్స్ బృందంలో ఓ 60 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అతడిని నరితా ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడికి వేరే జబ్బులుండడం, పెద్ద వయసు కావడంతో ముందుజాగ్రత్తగా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. మిగతా బృంద సభ్యులందరినీ క్వారంటైన్ కు తరలించారు.

వాస్తవానికి టోక్యోలో గత ఏడాదే ఒలింపిక్స్ జరగాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి విజృంభణతో ఈ ఏడాదికి వాయిదా వేశారు. అసలు ఒకానొక సందర్భంలో ఒలింపిక్స్ ను రద్దు చేయాలన్న డిమాండ్ కూడా వినిపించింది. అయితే, కరోనా కొద్దిగా తగ్గుముఖం పట్టడం, ప్రపంచంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, బయో బబుల్ వంటి కఠినమైన ఆంక్షలు విధించడం వంటి వాటితో ఒలింపిక్స్ నిర్వహణకే కమిటీ మొగ్గు చూపింది. జులై 23 నుంచి ఒలింపిక్స్ మొదలవుతాయని ప్రకటించింది.

వివిధ దేశాలకు చెందిన 15,400 మంది ఒలింపిక్స్ పతకాల వేటకు సిద్ధమయ్యారు. వారేకాకుండా మీడియా ప్రతినిధులు, ప్రసార మాధ్యమాల ప్రతినిధులు, ఒలింపిక్స్ లో భాగమైన దేశాల అధికారులు, జడ్జిలు లక్షలాదిగా తరలిరానున్నారు. ఒలింపిక్స్ కోసం 1,540 కోట్ల డాలర్లు (సుమారు రూ.1.15 లక్షల కోట్లు) ఖర్చు పెట్టనున్నారు.

More Telugu News