Raghu Rama Krishna Raju: న‌వ సూచ‌న‌లు పేరుతో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు ర‌ఘురామ కృష్ణ‌రాజు ఆరో లేఖ

  • 18 ఏళ్లు నిండినవారికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ అమలు కావడంలేదు
  • విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు
  • వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలి
raghu rama writes letter to jagan

న‌వ సూచ‌న‌లు (విధేయ‌త‌తో) పేరుతో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు ఈ రోజు ఆరో లేఖ రాశారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించిన తరువాత కూడా 18 సంవత్సరాలు నిండినవారికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ అమలు కావడంలేదని ఆయ‌న అన్నారు. దీంతో విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జ‌గ‌న్‌కు సూచిస్తున్నానని తెలిపారు.
 
దేశంలో కరోనా రెండో ద‌శ విజృంభ‌ణ‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా 18 సంవత్సరాలు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందచేస్తామని ప్రకటించిందని ర‌ఘురామ అన్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి యువతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ వ్యాక్సిన్ అందచేశారని ఆయ‌న చెప్పారు. ఏపీలోనూ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కోరారు.
 
అలాగే, ఏపీకి అప్పులిచ్చేవారు ఎవ‌రూ లేర‌ని ర‌ఘురామ‌ చుర‌క‌లంటించారు. ఏపీలో కనీసం మంచి వైద్యులైనా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆయ‌న అన్నారు. రాష్ట్ర‌ మెడికల్ కౌన్సిల్‌, ఏపీ హెచ్ఎంహెచ్ఐడీసీలకు అధిపతులుగా స‌రైన‌ అనుభవం లేని ఇద్దరు తెలంగాణ వైద్యులను నియమించారని ఆయ‌న చెప్పారు.

ఇక్క‌డ‌ తెలంగాణ వైద్యుల నియామకం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయ‌న అన్నారు. ఇలాంటి వైద్య సంబంధిత సంస్థలకు అధిపతులుగా ఇత‌ర‌ రాష్ట్రాల వైద్యులను కాకుండా సొంత రాష్ట్ర‌ పరిస్థితులు తెలిసిన స్థానిక వైద్యులను నియమించాలని ఆయ‌న కోరారు.

More Telugu News