Revanth Reddy: నా వల్లే కిషన్ రెడ్డికి కేబినెట్ ప్రమోషన్ వచ్చింది: రేవంత్ రెడ్డి

  • జూబ్లీహిల్స్ లో రేవంత్ మీడియా సమావేశం
  • తన రూపంలో పీసీసీకి బలమైన అధ్యక్షుడున్నాడని వెల్లడి
  • అందుకే కిషన్ రెడ్డి ర్యాంకు పెంచారని వ్యాఖ్యలు
  • సోనియాను కేసీఆర్ మోసం చేశారని ఆరోపణ
Revanth Reddy comments on latest developments

తాజా రాజకీయ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కేంద్రంలో నిన్నటివరకు సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ వచ్చిందంటే అందుకు కారణం తానేనని రేవంత్ అన్నారు. "నా రూపంలో తెలంగాణ కాంగ్రెస్ కు బలమైన అధ్యక్షుడు ఉన్నాడు. నన్ను ఎదుర్కోవాలంటే  తెలంగాణ బీజేపీ అగ్రనాయకత్వం కూడా బలంగా ఉండాలని కేంద్రం పెద్దలు భావించారు. అందుకే కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చారు" అని వివరించారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పైనా విమర్శలు చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని చెప్పి సోనియాను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళతారని జోస్యం చెప్పారు. గాలివాటుగా గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని, ఎప్పుడైనా పేకమేడలా కూలిపోతుందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 72 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ నుంచి వచ్చానంటూ తనపై టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని, సీఎం కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చినవాడేనని వారు గుర్తించాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. అంతెందుకు, తలసాని, గంగుల, కొప్పుల, మల్లారెడ్డి తదితరులు టీడీపీ నుంచి వచ్చినవారేనని అన్నారు.

More Telugu News