Bhuma Akhila Priya: మాపై ఒత్తిడి తీసుకురావాల‌నే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు: అఖిల ప్రియ‌

  • బోయినపల్లి కిడ్నాప్ కేసులో మ‌రో కేసు
  • మండిప‌డ్డ మాజీమంత్రి అఖిల ప్రియ‌
  • ఎప్పుడు విచారణకు పిలిచినా వెళుతున్నామ‌ని వ్యాఖ్య‌
  • తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి య‌త్నిస్తున్నార‌ని ఆరోప‌ణ
akhila priya on cases against her

హైద‌రాబాద్‌లోని బోయినపల్లిలో క‌ల‌క‌లం రేపిన‌ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా భర్త భార్గవ్ రామ్ తో పాటు ఆమె సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. దీనిపై అఖిలప్రియ స్పందిస్తూ మండిప‌డ్డారు. త‌మపై ఒత్తిడి తీసుకురావాల‌నే కొంద‌రు ప్రయత్నాలు చేస్తున్నారని, అంత‌కు మించి ఈ కేసులో వాస్తవాలు లేవని వ్యాఖ్యానించారు.  

కోర్టు, పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా తాము వెళుతున్నప్ప‌టికీ త‌మ‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని ఆమె ఆరోపించారు. త‌మ‌ను ఎలాగైనా ఇరికించాలని కొంద‌రు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. విచారణకు రావాలని న్యాయ‌స్థానం గతంలో భార్గవ్ రామ్‌కు రెండుసార్లు నోటీసులు ఇచ్చిందని, దీంతో కోర్టుకు హాజరయ్యామని తెలిపారు.

ఫిర్యాదుదారులే కోర్టుకు రాకపోవడంతో విచారణ ఆలస్యమైందని వివ‌రించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తమపై తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. తాము పోరాడుతున్న‌ది ఆస్తుల కోసం కాదని, హక్కు కోసమేన‌ని చెప్పుకొచ్చారు.

More Telugu News