Bandi Sanjay: టీఆర్ఎస్ కుట్ర‌ల‌న్నింటినీ ఎదుర్కొంటాం.. హుజూరాబాద్‌లో గెలుస్తాం: బ‌ండి సంజ‌య్

  • హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు
  • కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేయాల‌నుకుంటున్నారు
  • ప్రజలంతా సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్నారు
bandi sanjay slams trs

తెలంగాణ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో త్వ‌ర‌లోనే హుజూరాబాద్ లో ఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. దీనిపై బీజేపీ కార్యాలయంలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుగ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్వంలో బీజేపీ నేత‌లు స‌మావేశమ‌య్యారు.

ఇందులో కేంద్ర హోం శాఖ స‌హాయ‌ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘనందనరావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర నేత‌ డీకే అరుణతో పాటు ప‌లువురు పాల్గొన్నారు. పార్టీ హుజూరాబాద్ ఇన్‌చార్జ్‌ల‌కు కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ... హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజ‌యం త‌మ‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. టీఆర్ఎస్ కుట్ర‌ల‌న్నింటినీ ఎదుర్కొంటామ‌ని తెలిపారు. ఈటల రాజేందర్‌ గెలుపునకు కృషి చేయాలని హుజూరాబాద్‌ ఇన్‌ఛార్జి, మండల ఇన్‌ఛార్జులకు ఆయ‌న సూచించారు.

గెలుపుకోసం టీఆర్ఎస్ పార్టీ నేత‌లు కుట్ర పూరితంగా ప్రయత్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చుపెట్ట‌యినా స‌రే హుజూరాబాద్‌లో గెలవాల‌ని ప్రయత్నాలు జరుపుతున్నారని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్నారని ఆయ‌న అన్నారు.  


More Telugu News