Bangladesh: డ్రైనేజీ పైపు ద్వారా భార‌త్‌లోకి చొర‌బ‌డ్డ బంగ్లాదేశ్ యువ‌కులు.. ఏపీలో 8 మంది అరెస్టు

  • బీహార్ లోని దర్భంగ ఘ‌ట‌న నేప‌థ్యంలో పోలీసుల అప్ర‌మ‌త్తం
  • పాస్ పోర్టు లేకుండా భార‌త్‌లోకి వ‌చ్చిన బంగ్లాదేశ్ యువ‌కులు
  • రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నలుగురి అరెస్టు
  • మ‌రో న‌లుగురు విజ‌య‌వాడ‌లో అరెస్టు 
  • న‌కిలీ ఆధార్‌కార్డులు, పాన్‌కార్డు, ఓట‌ర్ కార్డులు స్వాధీనం
bangla youth arrest

బీహార్ లోని దర్భంగ రైల్వే స్టేషన్‌లో గత నెల‌ 17న జరిగిన వస్త్రాల పార్సిల్‌లో పేలుడు కేసు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోన్న విష‌యం తెలిసిందే. దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన ఈ వ్య‌వ‌హారంలో హైదరాబాద్‌లో నివాసముంటున్న నాసిర్‌ మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లను ఎన్‌ఐఏ ఇటీవ‌లే అరెస్ట్‌ చేసింది. సికింద్రాబాద్‌ నుంచే పేలుడు ప‌దార్థాల‌ పార్సిల్‌ను దర్భంగా రైలులో పంపించినట్లు ఇప్ప‌టికే తేలింది. ఈ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మై రైళ్ల‌లో త‌నిఖీలు చేస్తోన్న ఏపీ పోలీసులకు భారీగా బంగ్లాదేశ్ యువ‌కులు ప‌ట్టుబ‌డ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

పాస్ పోర్టు లేకుండా భార‌త్‌లోకి అక్ర‌మంగా ప్ర‌వేశించిన ఎనిమిది మంది బంగ్లాదేశ్ యువ‌కుల‌ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. వారిలో న‌లుగురిని రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో అరెస్టు చేయ‌గా, మ‌రో న‌లుగురిని విజ‌య‌వాడ‌లో అదుపులోకి తీసుకున్నారు.

వారంతా మొద‌ట‌ బంగ్లాదేశ్ నుంచి ప‌శ్చిమ బెంగాల్ హావ్రాలోకి, అక్క‌డి నుంచి రైళ్ల‌లో ప‌లు ప్రాంతాల్లో తిరుగుతున్న‌ట్లు తెలిసింది. వారంతా కొన్నేళ్ల క్రిత‌మే పాస్‌పోర్టు లేకుండా డ్రైనేజీ పైపు ద్వారా భార‌త్‌లోకి చొర‌బ‌డ్డార‌ని పోలీసులు గుర్తించారు. వారి వ‌ద్ద అధికారిక ప‌త్రాలు లేక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి అదుపులోకి తీసుకోగా ప‌లు విష‌యాలు తెలిశాయి.

వారంతా బెంగ‌ళూరు చిరుమానాతో న‌కిలీ ఆధార్‌కార్డులు, పాన్‌కార్డు, ఓట‌ర్ కార్డుల‌తో భార‌త్‌లో తిరుగుతున్నార‌ని పోలీసులు తేల్చారు. 2017-2019 మ‌ధ్య వారంతా గోవాలో ఉన్న‌ట్లు గుర్తించారు. భార‌త్‌లో కొవిడ్ నేప‌థ్యంలో 2019లో బంగ్లాదేశ్ కు వెళ్లారు. గ‌త నెల క్రిత‌మే మ‌ళ్లీ గోవాకు వ‌చ్చి, భార‌త్‌లోని ప‌లు ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఎనిమిది మంది యువ‌కుల‌ను పోలీసులు విచారిస్తున్నారు. వారి నుంచి సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు పూర్తి వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

More Telugu News