Prime Minister: ఎంఎస్​ఎంఈ పరిధిలోకి రిటైల్​, హోల్​ సేల్​ వర్తకం చారిత్రాత్మక నిర్ణయం: ప్రధాని నరేంద్ర మోదీ

  • కోట్లాది మందికి లబ్ధి
  • ఆర్థిక సాయంతో పాటు వ్యాపార వృద్ధి
  • నిన్న నూతన మార్గదర్శకాలు విడుదల
Its a Landmark Decision says PM Modi

రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) జాబితాలో రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలను చేర్చి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. దీని వల్ల కోట్లాది మంది వర్తకులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. వేగంగా ఆర్థిక సాయం అందడంతో పాటు వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయన్నారు. వ్యాపారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలనూ ఎంఎస్ఎంఈ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు నిన్న కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన నూతన మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. కొత్త నిబంధనలతో దాదాపు 2.5 కోట్ల మంది రిటైల్, హోల్ సేల్ వర్తకులు లబ్ధి పొందుతారని చెప్పారు. దీంతో ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రాధాన్య రంగాలకు రుణాల్లో చిరు వర్తకులకు లాభం కలుగుతుంది. అంతేగాకుండా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో వారు నమోదు చేసుకోవచ్చు.

More Telugu News