Vishnu Vardhan Reddy: ఆంధ్రా రైతులపై మీకు కడుపు మంట: కేసీఆర్‌పై బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి మండిపాటు

  • ఉద్దేశపూర్వకంగా నీళ్లను సముద్రంలోకి పంపారు
  • మీరు చేసిన అన్యాయం ఆంధ్రా రైతుకు మాత్రమే కాదు
  • ఈ దేశ రైతులందరికీ చేశారు
  • మీరు చరిత్రలో రైతు ద్రోహిగా మిగులుతారు
vishnu vardhan slams kcr

తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం నెల‌కొన్న నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఏపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 'ఆంధ్రా రైతులపై కడుపు మంటతో ఉద్దేశపూర్వకంగా నీళ్లను సముద్రంలోకి పంపించిన చరిత్ర మీకు మాత్రమే దక్కుతుంది కేసీఆర్ దొర గారు' అని విమ‌ర్శించారు.

'పులిచింతలలో తెలంగాణ జెన్‌కో అసందర్భంగా, దౌర్జన్యంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన కారణంగా 7,400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుండి ఐదు గేట్ల ద్వారా 8,600 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. మరిన్ని గేట్లు ఎత్తి వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వృథాగా పంపుతున్నారు' అని విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.

'కేసీఆర్ గారు మీరు చేసిన అన్యాయం ఆంధ్రా రైతుకు మాత్రమే కాదు.. ఈ దేశ రైతులందరికి. మీరు చరిత్రలో రైతు ద్రోహిగా మిగులుతారు. నేటి సమాజం హిట్లర్ ను చూడలేదు, హిట్లర్ రూపంలో ఉన్న కేసీఆర్ గారిని ప్రత్యక్షంగా తెలుగురాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు' అని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు.

'చరిత్ర ఎన్నటికీ మీ అనైతిక అహంకార, పిచ్చి చర్యలను మరచిపోదు. స్వార్థ రాజకీయాల కోసం మీరు చేస్తున్న దుర్మార్గాలకు, తెలంగాణ రైతులు సైతం బుద్ధి చెప్పే రోజు వస్తుంది' అని విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

More Telugu News