Raghu Rama Krishna Raju: జగన్‌, కేసీఆర్‌ రాజకీయ అవసరాల కోసం ఇటువంటి ప‌నులు చేయకూడదు: రఘురామకృష్ణరాజు

  • ఇరు రాష్ట్రాల సీఎంలు ఉద్దేశ‌పూర్వ‌కంగా నీటి గొడవలు పెంచకూడ‌దు
  • పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొన‌సాగించాల‌ని జ‌గ‌న్ అన్నారు
  • దీంతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు
  • మ‌రి జల వివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు?
raghu rama writes letter to jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ మ‌ధ్య నీటి వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్రాజెక్టుల వ‌ద్ద ఇప్ప‌టికే భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. నీటి పంప‌కాల విష‌యంలో ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల తీరుపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.  

నవసూచనల పేరిట సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న ఈ రోజు నాలుగో లేఖ రాసి ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. రాజకీయ అవసరాల కోసం ఇరు రాష్ట్రాల సీఎంలు ఉద్దేశ‌పూర్వ‌కంగా ఈ గొడవలు పెంచకూడ‌ద‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. న‌దీ జలాల విష‌యంలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్యలపై ఇరు రాష్ట్రాల ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆయ‌న చెప్పుకొచ్చారు.

పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు కొన‌సాగించాల‌ని, దీంతో ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చని  జగన్ అన్నార‌ని, మ‌రి జల వివాదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. జ‌గ‌న్ నిన్న మాట్లాడుతూ తెలంగాణలోని ఆంధ్రా వారి గురించి వ్యాఖ్య‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని ర‌ఘురామ‌ చెప్పారు.

నీటి వివాదంపై ప్రధాని మోదీకి జ‌గ‌న్ లేఖలు రాయడం వల్ల సత్వర పరిష్కారం ఉండదన్న సంగతి జగన్‌కు కూడా తెలుస‌ని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు సమావేశమై చ‌ర్చ‌లు జ‌రిపి వివాదాలను పరిష్కరించాలని ఆయ‌న కోరారు.

More Telugu News