India: టీకాలు వేయడంలో మరో ఘనత: అమెరికాను దాటేసిన భారత్​

  • 32.36 కోట్ల డోసులు వేసిన భారత్
  • అమెరికాలో 32.33 కోట్ల డోసులు
  • ఆరు నెలల టైం తీసుకున్న అగ్రరాజ్యం
  • ఐదు నెలల్లోనే వేసిన భారత్
India Over Takes USA In Vaccination

వ్యాక్సినేషన్ లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. టీకాల్లో అమెరికాను దాటేసింది. ఇప్పటిదాకా మన దేశంలో 32 కోట్ల 36 లక్షల 63 వేల 297 డోసుల టీకాలు వేయగా.. అమెరికాలో 32 కోట్ల 33 లక్షల 27 వేల 328 డోసులు వేశారు. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

అయితే, వ్యాక్సినేషన్ క్రమంలో అమెరికా కన్నా తక్కువ టైంలోనే అన్ని డోసులు వేయడం విశేషం. అమెరికా అన్ని డోసులు వేయడానికి ఆరు నెలలు పడితే.. మనకు కేవలం ఐదు నెలల టైమే పట్టింది. అంటే అమెరికా కన్నా నెల ముందే ఆ మార్కును భారత్ అధిగమించింది.

డిసెంబర్ 14న అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్ మొదలవగా.. భారత్ లో జనవరి 16న ప్రారంభమైంది. కొన్ని రోజుల క్రితం 86 లక్షల డోసుల టీకాలేసి ఒక్కరోజులోనే అత్యధిక టీకాలేసిన రికార్డును సాధించింది భారత్. అయితే, ఆ తర్వాత టీకా కార్యక్రమం మళ్లీ స్లో అయింది. నిన్న 13.9 లక్షల మందికి ఫస్ట్ డోస్ టీకా వేశారు. మరో 3.3 లక్షల మందికి రెండో డోసు ఇచ్చారు. మొత్తంగా 17.21 లక్షల డోసుల వ్యాక్సిన్ నే ప్రజలకు వేశారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంటోందని, ఈ ఘనతలో భాగమైన వారందరికీ అభినందనలు అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకాలు వేయడమే తమ ప్రాధాన్యమని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సమాజం, ప్రభుత్వం అండతోనే ఈ ఘనత సాధించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. వివిధ దేశాలతో పోలుస్తూ వ్యాక్సినేషన్ లో భారత్ ఏ స్థానంలో ఉందో గ్రాఫ్ ను ట్వీట్ చేశారు.

జూన్ 21 నుంచి 45 ఏళ్ల లోపున్న వారికీ వ్యాక్సినేషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కేంద్రమే అందరికీ ఫ్రీగా టీకాలు వేస్తోంది. ప్రైవేటులో వ్యాక్సిన్ వేసుకోవాలనుకునే పేదవారికి ఉచిత టీకా కోసం ఈవోచర్లనూ అందిస్తోంది.

  • Loading...

More Telugu News