Raghu Rama Krishna Raju: ఏపీ సీఎం జ‌గ‌న్‌కు మ‌రో లేఖ రాసిన‌ ఎంపీ రఘురామకృష్ణరాజు

  • ఏపీ జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న‌
  • రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి
  • ఆరోగ్యశ్రీ హెల్త్‌కార్డుల‌ విషయాలలో వారి సమస్యలు పరిష్కరించాలి
  • వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలి
raghu rama writes letter to jagan

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు మ‌రో లేఖ రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో ఆయ‌న లేఖ‌లు రాయ‌డం మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. ఏపీలో జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌ల‌ గురించి ఆయ‌న ఈ రోజు రాసిన లేఖలో ప్ర‌స్తావించారు.

రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ హెల్త్‌కార్డుల‌ విషయాలలో వారి సమస్యలు పరిష్కరించాలని, కరోనా సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నందున వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలని జ‌గ‌న్‌ను కోరారు.  

మీడియా అక్రిడిటేషన్ల కమిటీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ‌యం సరికాద‌ని ఆయ‌న అన్నారు. సాధార‌ణంగా జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చే అక్రిడిటేషన్ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ మీడియా సంస్థల నుంచి జర్నలిస్టులతో పాటు జర్నలిస్టు యూనియన్ నాయకులు సభ్యులుగా ఉంటారని ఆయ‌న గుర్తు చేశారు.

కానీ, ఏపీ స‌ర్కారు ఏర్పాటు చేసిన అక్రిడిటేషన్ కమిటీలో మాత్రం ఒక్క జర్నలిస్టు కూడా లేడని, ఈ విషయంపై ఏ జర్నలిస్టు సంఘం కూడా మాట్లాడటం లేదని అన్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని ఆయ‌న చెప్పారు.

జ‌గ‌న్ పాదయాత్ర చేసిన స‌మ‌యంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కారిస్తాన‌ని హామీ ఇచ్చారని ఆయ‌న చెప్పారు. అయితే, అధికారంలోకి రాగానే జ‌ర్న‌లిస్టుల విష‌యంలో తీసుకుంటోన్న నిర్ణ‌యాలు వారికి మ‌రింత న‌ష్టం క‌లిగించాయ‌ని చెప్పారు.  ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సాయం అందలేదని అన్నారు. ఇప్ప‌టికైనా జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని కోరారు.

More Telugu News