Jammu And Kashmir: మరో దారుణం... పుల్వామా ఎస్పీఓ దంపతులను కాల్చి చంపిన ఉగ్రవాదులు!

  • జమ్మూ ఎయిర్ బేస్ పై నిన్న డ్రోన్లతో దాడి
  • ఆపై గంటల వ్యవధిలోనే మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
  • ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టిన జవాన్లు
Terrorists Shoot Dead SPO in Pulwama

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరో దాడికి తెగబడ్డారు. జమ్ము ఎయిర్ ఫోర్స్ బేస్ పై డ్రోన్లతో దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే పుల్వామా జిల్లాలో ప్రత్యేక పోలీసు అధికారిగా ఉన్న ఫయాజ్ అహ్మాద్ ఇంటిలోకి చొరబడి, ఆయన్ను, ఆయన భార్యను దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో వారిద్దరూ మరణించగా, వారి కుమార్తె తీవ్ర గాయాలపాలైంది. అవంతిపోరా సమీపంలోని హరిపరిగామ్ కు చెందిన ఫయాజ్, ప్రస్తుతం పుల్వామాలో ఎస్పీఓగా పని చేస్తున్నారని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆపై ఫయాజ్, ఆయన భార్య రాజా బేగంలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. ఆపై భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News