naresh: నాగ‌బాబు వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డ 'మా' అధ్య‌క్షుడు న‌రేశ్‌!

  • 'మా'లో టాలీవుడ్‌లో న‌టించిన ఎవ‌రైనా స‌రే పోటీ చేయొచ్చు
  • మాలో రాజ‌కీయ ఇష్యూలు త‌లెత్తుతున్నాయి
  • మా కోసం మేము చాలా క‌ష్ట‌ప‌డ్డాం
  • నాగ‌బాబు మాట‌లు విని షాక్ అయ్యాం
  • మా మ‌స‌క‌బారిపోయిందా? ముందు అడుగు వేస్తుందా?
naresh slams nagababu

నాలుగేళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్  (మా)  ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారింద‌ని సినీన‌టుడు నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై మా అధ్య‌క్షుడు న‌టుడు న‌రేశ్ మండిప‌డ్డారు.  మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల నేప‌థ్యంలో ఈ రోజు ఆయ‌న‌ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా న‌రేశ్ మాట్లాడుతూ... మాలో  టాలీవుడ్‌లో న‌టించిన ఎవ‌రైనా స‌రే మా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయొచ్చ‌ని తెలిపారు. మాలో రాజ‌కీయ ఇష్యూలు త‌లెత్తుతున్నాయ‌ని చెప్పారు.
 
తన గురించి తాను చెప్పుకునే అవ‌స‌రం లేద‌ని న‌రేశ్ అన్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు ఎలాంటి స‌మ‌స్య వ‌చ్చినా తాను, త‌న కుటుంబం సాయం చేస్తున్నామ‌ని తెలిపారు. మా లోని స‌భ్యుల‌ను తాను క‌లుపుకుపోలేద‌ని కొంద‌రు చేస్తోన్న విమ‌ర్శ‌లు స‌రికాద‌ని చెప్పారు.

నిన్న ఒక మీడియా స‌మావేశం జ‌రిగింద‌ని, అందులో కొంద‌రు ప‌లు వ్యాఖ్య‌లు చేశార‌ని న‌రేశ్ అన్నారు. మూడు నెల‌ల క్రిత‌మే ప్ర‌కాశ్ రాజ్ త‌న‌కు ఫోన్ చేసి, తాను మా ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకుంటున్న‌ట్లు చెప్పార‌ని తెలిపారు. ఎవ‌రైనా పోటీ చేయొచ్చ‌ని తాను చెప్పాన‌ని అన్నారు. మంచు విష్ణు కూడా త‌న‌తో మాట్లాడార‌ని తెలిపారు.

ఎవ‌రైనా స‌రే ఈ ఎన్నికల్లో పోటీ చేయొచ్చ‌ని తెలిపారు. మా అనేది ఒక రాజ‌కీయ వ్య‌వ‌స్థ కాద‌ని న‌రేశ్ అన్నారు. లోక‌ల్.. నాన్ లోకల్ అనే వ్యాఖ్య‌లు తాము చేయ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. నాగ‌బాబు త‌న‌కు మంచి మిత్రుడ‌ని, ఆయ‌న‌ అంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌ని చెప్పారు. మా ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారింద‌ని ఆయ‌న అన‌డం మాత్రం స‌రికాద‌ని చెప్పారు.

మా కోసం తాము చాలా క‌ష్ట‌ప‌డ్డామ‌ని తెలిపారు. ఆయ‌న మాట‌లు త‌మ‌ను బాధ‌పెట్టాయ‌న్నారు. ఆయ‌న మాట‌లు విని షాక్ అయ్యామ‌ని తెలిపారు. తాము మా లో అంద‌రం క‌లిసి ప‌ని చేస్తున్నామ‌ని న‌రేశ్ చెప్పారు. సంస్థ‌ను కించ‌ప‌ర్చ‌డ‌మ‌నేది స‌రికాద‌ని చెప్పారు. మా మ‌స‌క‌బారిపోయిందా?  ముందు అడుగు వేస్తుందా? అన్న విష‌యంపై తాము నిన్న జీవితారాజ‌శేఖ‌ర్ తో క‌లిసి చ‌ర్చించామ‌ని తెలిపారు.

మాలో 914 మంది జీవిత‌కాల‌ స‌భ్యులు ఉన్నారని చెప్పారు. అసోసియేట్ స‌భ్యులు 29 మంది ఉన్నార‌ని న‌రేశ్ చెప్పారు. తాము 700 మంది స‌భ్యుల ఇంటికి వెళ్లి స‌ర్వే చేశామ‌ని తెలిపారు. మొత్తం 728 మందితో రూ.3 ల‌క్ష‌ల చొప్పున‌ జీవిత బీమా చేయించామ‌న్నారు. 16 మంది చ‌నిపోతే సుమారు రూ.50 ల‌క్ష‌లు అందించామ‌ని తెలిపారు.  

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ లో ఇంత మందికి ఎన్న‌డ‌యినా బీమా చేయించారా? అని ఆయ‌న నిల‌దీశారు. ఆర్టిస్టుల పింఛ‌నును కూడా తాము పెంచామ‌ని న‌రేశ్ తెలిపారు. పొట్టి వీర‌య్య చ‌నిపోతే ఆయ‌న కుమార్తెకు పింఛ‌ను బ‌దిలీ చేశామ‌ని చెప్పారు. క‌రోనా స‌మ‌యంలో కూడా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని తెలిపారు. జీవితారాజ‌శేఖ‌ర్ రూ.10 ల‌క్ష‌ల విరాళం ఇచ్చార‌ని చెప్పారు.

More Telugu News