Reliance: నవీ ముంబయిలో జియో ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు... విద్యా కార్యక్రమాలకు రిలయన్స్ శ్రీకారం

  • నేడు రిలయన్స్ 44వ ఏజీఎం నిర్వహణ
  • హాజరైన నీతా అంబానీ
  • జియో ఇన్ స్టిట్యూట్ వివరాలు వెల్లడి
  • ఈ విద్యాసంవత్సరం నుంచే కార్యకలాపాలు
Reliance starts Jio Institute in Navi Mumbai

నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 44వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్ హోదాలో నీతా అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జియో ఇన్ స్టిట్యూట్ వివరాలు తెలిపారు. నవీ ముంబయిలో జియో ఇన్ స్టిట్యూట్ స్థాపిస్తున్నట్టు వెల్లడించారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ, ఈ విద్యాసంవత్సరం నుంచే జియో ఇన్ స్టిట్యూట్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. జీవితకాల శిక్షణ, అత్యున్నత ఆవిష్కరణలకు జియో ఇన్ స్టిట్యూట్ ఓ ప్రపంచస్థాయి వేదికగా నిలుస్తుందని నీతా అంబానీ అభివర్ణించారు. దీనిద్వారా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు కూడా అందిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 21 వేల మంది పిల్లలకు క్రీడల్లో శిక్షణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మహిళలు, బాలికల సాధికారతకు కృషి చేస్తామని వివరించారు. ముఖ్యంగా, గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

అంతేకాదు, కొవిడ్ తో పోరాటానికి తమ రిలయన్స్ ఫౌండేషన్ 5 కార్యాచరణలు ప్రారంభించిందని నీతా అంబానీ వెల్లడించారు. మిషన్ ఆక్సిజన్, మిషన్ కొవిడ్ ఇన్ ఫ్రా, మిషన్ అన్న సేవ, మిషన్ ఎంప్లాయీ కేర్, మిషన్ వ్యాక్సిన్ సురక్ష పేరిట ఈ ఐదు మిషన్లు కొనసాగుతాయని వివరించారు.

More Telugu News