Telangana: ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసిన తెలంగాణ

  • అనుమతుల్లేకుండా ప్రాజెక్టు పనులు చేపడుతోందని ఆరోపణ
  • ఎన్జీటీ స్టే ఇచ్చినా లెక్కచేయడంలేదని వెల్లడి
  • ఏపీని అడ్డుకోవాలని విజ్ఞప్తి
  • బోర్డుకు తగిన ఆధారాలు సమర్పించిన తెలంగాణ సర్కారు
Telangana complaints on AP to Krishna river board

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవని, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే విధించినా లెక్కచేయకుండా, ఏపీ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తోందని ఆరోపించింది. డీపీఆర్ కోసం ప్రాథమిక పనులు అంటూ ప్రాజెక్టు పనులు చేపడుతోందని వివరించింది.

ప్రాజెక్టు పనులకు సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి తప్పనిసరి అని కేంద్రం కూడా ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ఏపీ ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని స్పష్టం చేసింది. తద్వారా తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి వాటాలను పరిరక్షించాలని కోరింది. తన ఆరోపణల మేరకు తెలంగాణ ప్రభుత్వం తగిన ఆధారాలను కూడా సమర్పించింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కు లేఖ రాశారు.

More Telugu News