Corona Virus: మూడో వేవ్‌ ముప్పు డెల్టా ప్లస్ వేరియంట్‌తోనేనా?

  • హెచ్చరిస్తున్న నిపుణులు
  • దేశవ్యాప్తంగా 22 కేసులు
  • మరో 8 దేశాలకూ పాకిన కొత్త రకం
  • కొత్త రకంపై అందుబాటులో లేని సమాచారం
Delta plus may cause third wave

కరోనా రెండో దశ నుంచి కోలుకుంటున్న భారత్‌ను కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లు కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ప్రబల రూపంగా మారి ఆందోళనకు గురిచేస్తున్న డెల్టా వేరియంట్‌ నుంచి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ అనే కొత్త రూపాంతరం పుట్టుకొచ్చింది. దీని వల్లే మూడో వేవ్‌ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు రాష్ట్రాల్లో 22 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తక్కువ సంఖ్యలో ఉన్న కేసులు మరింత విజృంభించక ముందే అరికట్టాలని హితవు పలికింది. భారత్‌తో పాటు అమెరికా, యూకే, పోర్చుగల్‌, స్విట్జర్లాండ్‌, జపాన్‌, పోలండ్‌, రష్యా, చైనాలకూ ఈ కొత్త రకం పాకిందని నీతి ఆయోగ్‌ సభ్యుడు(ఆరోగ్యం) వి.కె.పాల్‌ తెలిపారు. అయితే, ఈ వైరస్‌కు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవని.. అదే ఆందోళన కలిగిస్తున్న అంశమని పేర్కొన్నారు.

గతంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌ రకాలతో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు వేగంగా సోకే లక్షణం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వేరియంట్‌ నుంచి వచ్చిన డెల్టా ప్లస్‌కు మరింత వేగంగా, ఎక్కువ  మంది సోకే లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోందని నిపుణులు ప్రాథమిక అవగాహనకు వచ్చారు.

More Telugu News