Eatala Rajendar: తెలంగాణలో ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం మొదలైంది: ఈటల

  • షామీర్ పేటలో ఈటల మీడియా సమావేశం
  • బీజేపీలో చేరడం పట్ల గర్విస్తున్నానని వెల్లడి
  • 2024లో బీజేపీదే విజయం అని ధీమా
  • హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆత్మగౌరవానికి ప్రతీక అని వ్యాఖ్యలు
Eatala confidant about BJP win in next elections

ఇటీవల బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరడం పట్ల గర్విస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండానే రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. చరిత్ర ప్రారంభానికి ఏదో ఒక పార్టీలో ఉండాలి కాబట్టే టీఆర్ఎస్ లో పనిచేశానని, సుష్మస్వరాజ్, విద్యాసాగర్ రావు వంటి నేతలతో ఉద్యమంలో కలిసి పనిచేశానని తెలిపారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రజలు తమ సొంత ఎన్నికలా తీసుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ తామే బరిలో ఉన్నట్టుగా భావిస్తున్నారని ఈటల వివరించారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం మొదలైందని అన్నారు. హుజూరాబాద్ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిరూపం వంటిదని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్ పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మీడియా సమావేశంలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.

More Telugu News