Palla Srinivasarao: వైసీపీలోకి వెళ్లలేదనే చిల్లర రాజకీయాలు: టీడీపీ నేత పల్లా

  • భూమిని ఆక్రమిస్తే ముందస్తు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు
  • ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
  • 2024 తర్వాత విజయసాయి విశాఖలో ఉండరు
  • బహిరంగ  చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా?
TDP leader Palla Srinivasa Rao Challenge YCP MP Vijayasai Reddy

గతేడాది ఏప్రిల్ నుంచి వైసీపీ నేతలు తనను ఆక్రమణదారుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, అవాస్తవమని తేలితే విజయసాయిరెడ్డి విశాఖను వదిలిపెట్టేస్తారా? అని సవాలు విసిరారు. నిన్న విశాఖలో విలేకరులతో మాట్లాడిన పల్లా.. తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు.

ఆహ్వానించినా వైసీపీలోకి వెళ్లలేదన్న కక్షతోనే విజయసాయిరెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రూ. 750  కోట్ల విలువైన 49 ఎకరాల భూమిని తాను ఆక్రమించినట్టు ప్రచారం చేస్తూ తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగానే తాను భూమిని ఆక్రమించుకుంటే ముందస్తు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తనపై వస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమని, మీరు కూడా సిద్ధమేనా? అని విజయసాయికి సవాలు విసిరారు.

యాదవ జగ్గరాజుపేట గ్రామంలో తన కుటుంబానికి ఉన్న 41.30 ఎకరాల జిరాయితీ భూమికి సంబంధించిన వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లోనూ చూపించిన విషయాన్ని పల్లా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ భూములకు ఆనుకుని అక్కడక్కడా 75 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని, విక్రయిస్తే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని 2013లోనే ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేశానని పల్లా అన్నారు. 2024 తర్వాత విజయసాయి విశాఖలో ఉండే పరిస్థితి ఉండబోదని పల్లా స్పష్టం చేశారు.

More Telugu News