Andhra Pradesh: ఏపీలో కరోనా కట్టడి... ఏ జిల్లాలోనూ 1000కి దాటని కొత్త కేసులు

  • గత 24 గంటల్లో 87,756 కరోనా పరీక్షలు
  • 4,549 పాజిటివ్ కేసుల నమోదు
  • చిత్తూరు జిల్లాలో 860 కొత్త కేసులు
  • అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 182 కేసులు
  • రాష్ట్రంలో 59 మంది కరోనాతో మృతి
AP govt measures gives good results in corona crisis

కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతిని కట్టడి చేసేందుకు ఏపీ సర్కారు తీసుకుంటున్న చర్యలు క్రమంగా ఫలితాన్నిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏ జిల్లాలోనూ కొత్త కేసుల సంఖ్య 1000కి దాటలేదు. గడచిన 24 గంటల్లో ఏపీలో 87,756 కరోనా పరీక్షలు నిర్వహించగా... 4,549 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో నమోదైన 860 కేసులే అత్యధికం. ఆ తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో 619 పాజిటివ్ కేసులు గుర్తించారు. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 182 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 10,114 మంది కరోనా నుంచి కోలుకోగా, 59 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 12 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 18,14,393 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17,22,381 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 80,013 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 11,999కి చేరింది.

More Telugu News