Magnetic Powers: కరోనా టీకాతో అయస్కాంత శక్తులంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన కేంద్రం

  • వ్యాక్సిన్ తీసుకున్నవారిలో అయస్కాంత శక్తులంటూ ప్రచారం
  • మీడియాలో కథనాలు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
  • స్పందించిన కేంద్ర ప్రభుత్వం
Union govt condemns the news of magnetic powers in corona vaccinated people

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొందరికి అయస్కాత శక్తులు కలుగుతున్నాయంటూ వార్తలు వస్తుండడంపై కేంద్రం స్పందించింది. ఇటీవల నాసిక్ లో 71 ఏళ్ల అరవింద్ సోనార్, తాజాగా ఉల్హాస్ నగర్ లో శాంతారాం చౌదరి అనే వ్యక్తులకు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న అనంతరం అయస్కాంత శక్తులు వచ్చాయంటూ మీడియాలో కథనాలు దర్శనమిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతుండడం పట్ల కేంద్రం వివరణ ఇచ్చింది. వ్యాక్సిన్ తో అయస్కాంత శక్తులు లభించినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని, అవి నిరాధారమైన ఘటనలు అని కేంద్రం స్పష్టం చేసింది.

కరోనా కట్టడికి తాము అందజేస్తున్న టీకాలు పూర్తిగా సురక్షితమైనవని, వీటిపై జరిగే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్లు మానవ శరీరంలో అయస్కాంత శక్తిని కలిగించవని, వ్యాక్సిన్లలో లోహ ఆధారిత పదార్థాలు ఏమీ లేవని స్పష్టం చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే స్వల్పంగా తలనొప్పి, ఇంజెక్షన్ తీసుకున్న చోట కొద్దిగా నొప్పి, వాపు, తేలికపాటి జ్వరం వస్తాయని, ఇది సహజమేని పేర్కొంది. అంతేతప్ప, ఇతరత్రా జరిగే ప్రచారాలను విశ్వసించరాదని వివరించింది.

More Telugu News