South Africa: మోసం కేసులో గాంధీ ముని మనవరాలికి ఏడేళ్ల జైలు

  • భారతీయ వ్యాపారికి రూ.3.2 కోట్ల టోకరా
  • లేని దిగుమతులు ఉన్నట్టు చూపించి కొల్లగొట్టిన వైనం
  • దోషిగా తేల్చిన దక్షిణాఫ్రికా కోర్టు
  • మళ్లీ అప్పీల్ చేసుకోకుండా తీర్పు
Mahatma Gandhi Great Grand Daughter Gets 7 Year Jail in South Africa

ఓ భారతీయ వ్యాపారిని మోసం చేసిన కేసులో మహాత్మా గాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్ గోబింద్ (56)కు దక్షిణాఫ్రికా కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. ఎస్ ఆర్ మహారాజ్ అనే వ్యాపారవేత్తకు రూ.3.2 కోట్లు (62 లక్షల ర్యాండ్లు) టోకరా వేసినట్టు డర్బన్ లోని వాణిజ్య నేరాల ప్రత్యేక కోర్టు తేల్చింది. అంతేగాకుండా కోర్టు తీర్పును, శిక్షను మరే కోర్టులోనూ అప్పీల్ చేసుకోకుండా ఆదేశాలిచ్చింది.

డబ్బు కొల్లగొట్టేందుకు లతా రామ్ గోబింద్.. భారత్ నుంచి మూడు కంటెయినర్ల లినెన్ కాటన్ వస్త్రం వచ్చినట్టు నకిలీ ధ్రువపత్రాలు, తప్పుడు ఇన్ వాయిస్ లను సృష్టించారని నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ (ఎన్పీఏ)కి చెందిన బ్రిగేడియర్ హాంగ్వానీ ములౌజీ పేర్కొన్నారు.

ఇదీ కేసు..

న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్ వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్ అయిన ఎస్ఆర్ మహారాజ్ ను 2015 ఆగస్టులో లతా రామ్ గోబింద్ కలిశారు. మహారాజ్ సంస్థ వస్త్రాలు, లినెన్ వస్త్రాలు, పాదరక్షల దిగుమతితో పాటు వాటిని తయారు చేసి విక్రయిస్తుంటుంది. అంతేగాకుండా ఇతర సంస్థలకు లాభాల్లో వాటా ఆధారంగా పెట్టుబడి సాయం కూడా చేస్తుంటుంది.

ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రి గ్రూప్ నెట్ కేర్ కోసం మూడు కంటెయినర్ల లినెన్ వస్త్రాన్ని సరఫరా చేస్తున్నట్టు నమ్మించారు. అయితే, దిగుమతి రుసుం, కస్టమ్స్ సుంకం చెల్లించేందుకు తన దగ్గర డబ్బుల్లేవని, దానికోసం రూ.3.2 కోట్లు సాయం చేస్తే లాభాల్లో వాటా ఇస్తానని మహారాజ్ కు చెప్పారు.

అందుకు పోర్టులో ఆగిపోయినట్టున్న మూడు తనవి కాని కంటెయినర్లను ఫొటోల్లో చూపించారు. సరుకు కొన్నట్టు తప్పుడు ఇన్ వాయిస్ చూపించారు. ఆ తర్వాత నెలకు నెట్ కేర్ ఇన్ వాయిస్ ను మహారాజ్ కు పంపించారు. దీంతో మహారాజ్ రూ.3.2 కోట్లు పంపించారు. డబ్బు ముట్టినట్టు ధ్రువీకరిస్తూ నెట్ కేర్ బ్యాంక్ పేమెంట్ వివరాలను ఆమె ఆయనకు పంపారు.

అయితే, ఆమె చూపించినవన్నీ తప్పుడు పత్రాలేనని గ్రహించిన మహారాజ్ తాను మోసపోయాననుకుని ఆమెపై కేసు పెట్టారు. కేసును విచారించిన డర్బన్ కోర్టు లతా రామ్ గోబింద్ ను దోషిగా తేల్చింది. ఏడేళ్ల శిక్షను ఖరారు చేసింది.

కాగా, లతా గోబింద్.. ప్రముఖ అంతర్జాతీయ మానవ హక్కుల ఉద్యమకారిణి అయిన ఇలా గాంధీ, దివంగత మేవా రామ్ గోబింద్ దంపతుల కుమార్తె కావడం గమనార్హం. చాలా స్వచ్ఛంద కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొంటోంది. ఎన్జీవో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ నాన్ వయొలెన్స్ లో భాగంగా పార్టిసిపేటివ్ డెవలప్ మెంట్ ఇనిషియేటివ్ అనే గ్రూపుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆమె ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News