ఎమ్మెల్యే పదవికి రేపు రాజీనామా చేయనున్న ఈటల రాజేందర్!

Etela Rajender joins BJP On 8th this month
  • నేడు హైదరాబాద్ చేరుకోనున్న ఈటల, రవీందర్‌రెడ్డి
  • రేపు భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన
  • ఈటల సహా బీజేపీలోకి ఐదుగురు నేతలు
మంత్రివర్గం నుంచి బర్తరప్ అయిన టీఆర్ఎస్ అగ్రనేత ఈటల రాజేందర్ రేపు (శుక్రవారం) తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. అనంతరం 8 లేదంటే 9వ తేదీల్లో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం.

బీజేపీలో చేరికకు ఇప్పటికే సిద్ధమైన ఈటల.. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్‌ను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసి చర్చించారు. తనతోపాటు కాషాయ కండువా కప్పుకోబోతున్న ఏనుగు రవీందర్‌రెడ్డి.. తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామితో కలిసి బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో నిన్న సాయంత్రం భేటీ అయ్యారు.

ముందు ఎమ్మెల్యే పదవికి, ఆ తర్వాత టీఆర్ఎస్‌కు ఈటల రాజీనామా చేస్తారని, ఆ తర్వాత మంచి రోజు చూసుకుని బీజేపీలో చేరుతారని సమాచారం. ఈ విషయాన్ని రాజేందర్ స్వయంగా చెప్పినట్టు సమాచారం. ఈటల, ఏనుగు రవీందర్‌రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై రేపు ప్రకటన ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, ఈటల, ఏనుగు రవీందర్‌రెడ్డి సహా మొత్తం ఐదుగురు నేతలు కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం.
Go Back to Shorts
Etela Rajender
Enugu Ravinder Reddy
TRS
BJP

More Telugu News