Mamata Banerjee: కేంద్రంపై మరోమారు విరుచుకుపడిన మమత

  • డిసెంబరు నాటికి దేశం మొత్తానికి వ్యాక్సిన్లు ఇస్తామన్న కేంద్రం ప్రకటనపై ఎద్దేవా
  • తొలుత రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వాలని డిమాండ్
  • రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఇంకా 1.64 కోట్ల డోసులు ఉన్నాయన్న కేంద్రం
Mamata Banerjee fire on center over vaccination

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డిసెంబరు నాటికి దేశ ప్రజలందరికీ టీకాలు వేస్తామన్న కేంద్రం ప్రకటనను మమత ఎద్దేవా చేశారు. ఈ ప్రకటనను ఉత్త డ్రామాగా కొట్టిపడేశారు.  నేడు ఆమె కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రాష్ట్రాలకు టీకాలే పంపని కేంద్రం దేశం మొత్తానికి టీకాలు ఎలా వేస్తుందని ప్రశ్నించారు. కేంద్రం తొలుత అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
 
మరోవైపు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేడు మాట్లాడుతూ.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం 1.64 కోట్ల కరోనా వైరస్ డోసుల నిల్వలు ఉన్నాయని చెప్పడం గమనార్హం. కేంద్రం ఇప్పటి వరకు ఉచితంగా, ప్రత్యక్ష సేకరణ ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 23 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను అందించినట్టు తెలిపింది. నిరుపయోగంగా మారిన వాటితో కలుపుకుని ఇప్పటి వరకు 21,71,44,022 డోసులు వినియోగించినట్టు వివరించింది. ఇంకా, 1,64,42,938 వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద అందుబాటులో ఉన్నట్టు తెలిపింది.

More Telugu News