Sputnik V: హైదరాబాదుకు చేరిన మూడో విడత స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ డోసులు!

  • మూడో విడతలో ఏకంగా 27.9 లక్షల డోసుల దిగుమతి
  • ప్రత్యేక చార్టర్డ్  ఆర్యూ-9450  విమానంలో వ‌చ్చిన డోసులు
  • రెడ్డీస్‌ ల్యాబ్స్‌కు తరలింపు
  • ఇప్పటివరకు మొత్తం 30 లక్షల డోసులు భారత్‌కు
sputnik v reaches hyderabad

ర‌ష్యా నుంచి భార‌త్ స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ల‌ను దిగుమ‌తి చేసుకుంటోన్న విష‌యం తెలిసిందే. విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటోన్న తొలి వ్యాక్సిన్ ఇదే. స్పుత్నిక్-వీను మొద‌ట‌ హైద‌రాబాద్‌లోని ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చి అక్క‌డి నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌కు తరలిస్తున్నారు.

ఈ రోజు తెల్లవారుజామున 3.43 గంటలకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గోకు చేరుకుంది. మూడో విడతలో ఏకంగా 27.9 లక్షల డోసులు దిగుమతి అయ్యాయి. దీంతో దేశంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్‌ దిగుమతులకు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ కార్గో వేదికైంది. రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్  ఆర్యూ-9450  విమానంలో ఈ వ్యాక్సిన్ల‌ను తీసుకొచ్చారు. 90 నిమిషాల్లో దిగుమతి ప్రక్రియ పూర్తి చేసి, రెడ్డీస్‌ ల్యాబ్స్‌కు తరలించారు.

కాగా, తొలి విడ‌త‌లో భార‌త్‌కు 1.5 లక్షలు, రెండో విడతలో 60 వేల డోసులను దిగుమతి చేసుకున్న విషయం విదిత‌మే. ఇప్పటివరకు మొత్తం 30 లక్షల డోసులు భారత్‌కు చేరుకున్నాయి. ఈ నెల మ‌రో 50 లక్షల డోసులు దిగుమ‌తి కానున్నాయి. కొన్ని రోజుల్లో భార‌త్‌లో స్పుత్నిక్-వీ డోసుల‌ పంపిణీని ప్రారంభం కానుంది.

More Telugu News