COVID19: వ్యాక్సిన్​ విధానాలపై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

  • 45 ఏళ్లు దాటిన వారికే పూర్తి టీకాలా?
  • 45 ఏళ్ల లోపు వారికి మాత్రం సగమేనా?
  • ఇప్పుడు ఎక్కువ చనిపోతున్నది వారే
  • ఈ ఏడాది చివరికి అందరికీ టీకాలేస్తామన్న కేంద్రం
Supreme Court Questions Center Over Vaccine Policy

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కరోనా వ్యాక్సిన్ విధానాలపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. టీకాల కొరత, సమీకరణ, ధరలు, విధానాలపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధించింది.

45 ఏళ్లు పైబడిన వారికి 100 శాతం డోసులు ఇచ్చి.. 18–44 ఏళ్ల వారికి మాత్రం 50 శాతమే ఎందుకు ఇస్తున్నారని జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎల్.ఎన్. రావు, జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ ల త్రిసభ్య ధర్మాసనం నిలదీసింది. ‘‘45 ఏళ్లు దాటిన వారందరికీ కేంద్రమే టీకాలను సమీకరిస్తోంది. కానీ, 18 నుంచి 44 ఏళ్ల వారికి మాత్రం సగం రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. వాటి ధరలనూ కేంద్రమే నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పోను మిగతా డోసులను ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వవచ్చని ఆదేశాలూ ఇచ్చింది. ఏ ప్రాతిపదికన ఈ విధానాలను రూపొందించారు?’’ అని ప్రశ్నించింది.

45 ఏళ్లు దాటిన వారిలోనే కరోనా మరణాల ముప్పు ఎక్కువుందంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, కానీ, ఇప్పుడు సెకండ్ వేవ్ లో 45 ఏళ్ల లోపు వారే ఎక్కువ మంది చనిపోతున్నారని కోర్టు గుర్తు చేసింది. అలాంటప్పుడు కేవలం 45 ఏళ్ల పైన వారి కోసమే కేంద్రం టీకాలను ఎందుకు సమీకరిస్తోంది? అని ప్రశ్నించింది.

టీకాల కోసం కొవిన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధననూ ప్రశ్నించింది. ఈ నిబంధన వల్ల ఇంటర్నెట్ అంతంతమాత్రంగానే ఉండే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సరిగ్గా సాగదని అభిప్రాయపడింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కొవిన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం సవాలుతో కూడుకున్నదేనని పేర్కొంది.

గ్రామస్థులు సమీపంలోని కంప్యూటర్ కేంద్రానికి వెళ్లి కొవిన్ లో రిజస్ట్రేషన్ చేసుకోవచ్చన్న కేంద్ర ప్రభుత్వ సమాధానంపై సుప్రీం కోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అది నిజంగా సాధ్యమయ్యేదేనా? అని ప్రశ్నించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే వలస కూలీలకు అది సాధ్యం కాని పని అని అసహనం వ్యక్తం చేసింది.

కాగా, ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. వ్యాక్సిన్ల సమీకరణ కోసం ఫైజర్ వంటి సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, అవి సఫలీకృతమైతే ఇంకా ముందుగానే వ్యాక్సినేషన్ ను పూర్తి చేస్తామని వెల్లడించింది.

More Telugu News