Raghu Rama Krishna Raju: వీల్ చెయిర్ లో రాజ్ నాథ్ నివాసానికి వెళ్లిన రఘురామకృష్ణరాజు

  • ఢిల్లీలో రాజ్ నాథ్ తో భేటీ అయిన రఘురామ
  • 10 నిమిషాల పాటు సమావేశం
  • ఏపీ ప్రభుత్వ వైఖరిపై రాజ్ నాథ్ కు ఫిర్యాదు
  • ఇటీవలే ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన ఎంపీ
Raghurama Raju goes to Rajnath residence in wheelchair

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నడవకూడదని ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రఘురామ నేడు వీల్ చెయిర్ లోనే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసానికి వెళ్లారు. రాజ్ నాథ్ తో కొద్దిసేపు సమావేశమయ్యారు. సీఐడీ కేసు నుంచి ఎయిమ్స్ లో చికిత్స వరకు ఇటీవల జరిగిన పరిణామాలను కేంద్రమంత్రికి క్లుప్తంగా వివరించారు. తనపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయనకు తెలియజేశారు.

రాజద్రోహం కేసులో అరెస్టయిన రఘురామను కస్టడీలో పోలీసులు వేధించారన్న ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది. పోలీసులు కొట్టడం వల్ల తగిలిన దెబ్బలు అంటూ రఘురామ బాగా కమిలిపోయిన స్థితిలో ఉన్న తన రెండు కాళ్లను మీడియాకు ప్రదర్శించారు. ఈ వ్యవహారం సీఐడీ కోర్టు పరిధిని దాటి హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.

ఈ క్రమంలో ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. సుప్రీంకోర్టు బెయిల్ ఆదేశాలు ఇవ్వడంతో విడుదలైన ఆయన, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. ఆయన రెండు కాళ్లకు కట్లు కట్టిన ఎయిమ్స్ వైద్యులు, కొన్నిరోజుల పాటు నడవరాదని స్పష్టం చేశారు.

More Telugu News